ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వరుస ఓటములతో ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు దూరమయ్యాయి... చివరకు ధోని కూడా ఈ టీం ను కాపాడలేకపోయాడు. 

CSK vs PBKS : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ ఐపిఎల్ ఏమాత్రం కలిసిరాలేదు. ఇప్పటివరకు ఐపిఎల్ లో ఓ వెలుగు వెలిగిన జట్లలో సిఎస్కే టాప్ లో ఉంటుంది. కానీ ఈ సీజన్ లో ఆ టీం అధ:పాతాళానికి పడిపోయింది. సిఎస్కే ఆడుతుంటే మహేంద్ర సింగ్ ధోని నామస్మరణతో మారుమోగిపోయే మైదానాలు మౌనంగా మారిపోయాయి. ఈ ఐపిఎల్ ఆరంభంలో దెబ్బతిన్న చెన్నై టీం కోలుకోలేకపోయింది. చివరకు కెప్టెన్సీ పగ్గాలు ధోని చేతికి వచ్చినా సిఎస్కే కథ మారలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వరుస ఓటములతో సతమతం అవుతున్న చెన్నై టీం ను గాడిలో పెడతాడనుకుని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను పక్కనబెట్టి ధోనికి ఆ భాద్యతలు అప్పగించారు. అయినా చెన్నై ఆటతీరు మారలేదు. గత సీజన్ వరకు బ్యాటింగ్, బౌలింగ్ లో చాలా బలంగా కనిపించే ఈ టీం ఈసారి బలహీనంగా మారింది. ఆటగాళ్లలో పెద్ద మార్పు లేదు... ఆటలోనే మార్పంతా. దీంతో ధోని జట్టులో ఉంటే చాలనుకున్న అభిమానులే ఇక చాలు రెస్ట్ తీసుకోమంటున్నారు. 

ఇప్పటికే ఐపిఎల్ 2025 నుండి చెన్నై టీం దాదాపు బయటకు వెళ్లిపోయినట్లే... పాయింట్స్ టేబుల్ చివరన ఉన్న ఆ టీం ప్లేఆఫ్ కు చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. తాజాగా హోంగ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో మరో ఓటమిని చవిచూసింది. దీంతో ఇక చెన్నై ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యారు.

హోంగ్రౌండ్ లో చెన్నై ఓటమి : 

చెన్నై టీం ను చూసి ఒకప్పుడు భయపడేవారు... ధోని క్రీజులోకి వస్తున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకే. ఇదంతా ఒకప్పుడు... ఇప్పుడు సిఎస్కే పసికూనలా మారిపోయింది. చివరకు హోంగ్రౌండ్ లో కూడా వరుస ఓటములను చవిచూస్తోంది. ధోని కెప్టెన్సీలో ఈ పరాజయాలు ఎదురవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

తాజాగా పంజాబ్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని చేధించి చెన్నైని ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసి సిఎస్కే విసిరిన 190 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది పంజాబ్. మొదట చాహల్ హ్యాట్రిక్ తో చెన్నైని అల్లాడిస్తే తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీ (72 పరుగులు 41 బంతుల్లో) ఆకట్టుకున్నాడు. దీంతో సిఎస్కె ఖాతాలో మరో ఓటమి చేరింది. 

చెన్నై బ్యాట్ మెన్స్ లో సామ్ కర్రన్ 47 బంతుల్లోనే 88 పరుగులు చేసాడు. కానీ అతడికి సహచర ఆటగాళ్ళ నుండి సరైన సహకారం లభించలేదు. బ్రేవిస్ ఒక్కడు 32 పరుగులతో పరవాలేదనిపించాడు. వీరిద్దరివళ్లు సిఎస్కే 190 పరుగులు చేయగలిగింది. సిఎస్కే స్కోరు 200 దాటుతుందనుకునే సమయంలో చాహల్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టి కట్టడిచేసాడు. 

మొత్తంగా సిఎస్కే విసిరిన 191 పరుగుల విజయలక్ష్యాన్ని మరో రెండు బాల్స్ మిగిలివుండగానే పంజాబ్ చేధించింది. దీంతో సిఎస్కే పాయింట్ టేబుల్ లో అట్టడుగు స్థానానికే పరిమితం అయ్యింది. ఇక పైకి లేస్తుందన్న నమ్మకం కూడా అభిమానులకు లేదు.