INDvsNZ 2nd Test: ముంబై టెస్టులో టీమిండియా ఘన విజయం... కివీస్ని చిత్తు చేసి టెస్టు సిరీస్ కైవసం...
ముంబై టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న భారత జట్టు... 1-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం...
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 540 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు, రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఫలితంగా భారత జట్టు 372 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది. తొలి టెస్టులో ఒక్క వికెట్ తీయలేక డ్రాతో సరిపెట్టుకున్న టీమిండియా, ముంబై టెస్టులో గెలిచి 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది.
ఓవర్నైట్ స్కోరు 140/5 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు, జయంత్ యాదవ్ మ్యాజిక్కి వరుస వికెట్లు కోల్పోయింది. 50 బంతులాడి 5 ఫోర్లతో 18 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర, జయంత్ యాదవ్ బౌలింగ్లో పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేల్ జెమ్మీసన్, టిమ్ సౌథీలను ఒకే ఓవర్లో డకౌట్ చేశాడు జయంత్ యాదవ్. ఆ తర్వాత 1 పరుగు చేసిన విలియం సోమర్విల్లే కూడా జయంత్ యాదవ్ బౌలింగ్లోనే మయాంక్ అగర్వాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఇదీ చదవండి: ఆర్సీబీ కోచ్గా ఏబీ డివిల్లియర్స్... విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ 2022 సీజన్లో...
ఆ తర్వాత 111 బంతుల్లో 8 ఫోర్లతో 44 పరుగులు చేసిన హెన్రీ నికోలస్ను రవిచంద్రన్ అశ్విన్ స్టంపౌట్ చేయడంతో 167 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఇన్నింగ్స్కి తెరపడింది. రెండో ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా, జయంత్ యాదవ్కి నాలుగు వికెట్లు దక్కాయి. అక్షర్ పటే్ ఓ వికెట్ తీశాడు.
అంతకుముందు మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్లో భారత జట్టుకి తొలి బ్రేక్ అందించాడు. 6 పరుగులు చేసిన టామ్ లాథమ్, అశ్విన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 41 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన విల్ యంగ్, అశ్విన్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
6 పరుగులు చేసిన రాస్ టేలర్, అశ్విన్ బౌలింగ్లోనే ఛతేశ్వర్ పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కివీస్ని డార్ల్ మిచెల్, హెన్రీ నికోలస్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ 18.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, నాలుగో వికెట్కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేసిన డార్ల్ మిచెల్, అక్షర్ పటేల్ బౌలింగ్లో జయంత్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న భారత జట్టుకి అనుకూలంగా ఫలితం వచ్చింది...
ఆ తర్వాత వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ 6 బంతులాడి పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. 129 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్... అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 276/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన ఆధిక్యంతో కలిసి న్యూజిలాండ్ ముందు 540 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
Read also: టీ20 వరల్డ్ కప్లో అందుకే ఓడిపోయాం... భారత జట్టు ప్రదర్శనపై సౌరవ్ గంగూలీ కామెంట్స్...
ఓవర్నైట్ స్కోరు 69/0 వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, ఆరంభంలో దూకుడుగా ఆడింది. మొదటి 5 ఓవర్లలో 30 పరుగులు రాబట్టిన పూజారా, మయాంక్ అగర్వాల్ ధాటిగా బ్యాటింగ్ చేశారు.
మయాంక్ అగర్వాల్ కంటే ఛతేశ్వర్ పూజారా దూకుడుగా ఆడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి వికెట్కి 107 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 108 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 62 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ను అజాజ్ పటేల్ అవుట్ చేయడం విశేషం... 97 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 47 పరుగులు చేసిన పూజారా కూడా అజాజ్ పటేల్ బౌలింగ్లోనే రాస్ టేలర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
తొలి ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేస్తూ రెండు సార్లు గాయపడిన శుబ్మన్ గిల్, వన్డౌన్ ప్లేయర్గా క్రీజులోకి వచ్చాడు. శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
75 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 47 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, రచిన్ రవీంద్ర బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 8 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, అజాజ్ పటేల్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు... 84 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 36 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని రచిన్ రవీంద్ర క్లీన్బౌల్డ్ చేశాడు... 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసిన అక్షర్ పటేల్ నాటౌట్గా నిలిచాడు.