టీ20 వరల్డ్ కప్లో అందుకే ఓడిపోయాం... భారత జట్టు ప్రదర్శనపై సౌరవ్ గంగూలీ కామెంట్స్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్గా బరిలో దిగిన టీమిండియా, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. టీమిండియా గ్రూప్ స్టేజ్కే పరిమితం కావడానికి కారణాలను చెప్పుకొచ్చాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...
‘ఇప్పుడే కాదు, గత రెండు ఐసీసీ టోర్నీల్లో కూడా టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను కామెంటేటర్గా ఉన్నా...
ఓవల్లో జరిగిన ఆ మ్యాచ్లో పాకిస్తాన్ చేతుల్లో టీమిండియా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది...
గ్రూప్ స్టేజ్లో అద్భుతంగా ఆడి, అందరినీ ఓడించి టేబుల్ టాపర్గా ప్లేఆఫ్స్కి వచ్చింది. సెమీస్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది, రెండు నెలల కష్టాన్ని ఒకే ఒక్క బ్యాడ్ డే తుడిచిపెట్టేసింది...
ఆ రెండు టోర్నీలతో పోలిస్తే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీల్లో భారత జట్టు పర్ఫామెన్స్ కాస్త నిరుత్సాహానికి గురి చేసింది. ఈ మధ్యకాలంలో ఇదే అతి చెత్త ప్రదర్శన...
ఎందుకంటే గత ఐదారేళ్లుగా భారత జట్టు చాలా చక్కగా ఆడుతోంది. అలాంటి టీమ్, ఇలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందని ఎవ్వరూ ఆశించరు. ప్రపంచకప్లో మనోళ్లు ఇలా ఆడడానికి కారణమైతే నాకు తెలీదు...
నా వరకైతే వరల్డ్ కప్లో టీమిండియా స్వేచ్ఛగా ఆడలేకపోయింది. కొన్నిసార్లు పెద్ద టోర్నమెంట్లలో ఆడుతున్నామనే ఆలోచన, మన ఆటతీరును కంట్రోల్ చేస్తుంది....
పాకిస్తాన్తో, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచుల్లో ఇదే నేను గమనించా. ఈ రెండు మ్యాచుల్లో భారత జట్టు తనకున్న సామర్థ్యంలో కేవలం 15 శాతం మాత్రమే వాడినట్టు కనిపించింది...
కొన్నిసార్లు వాళ్లు ఇలా ఆడడానికి ఇదే కారణమని వేలెత్తి చూపించలేము. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు, నిజమైతే కొన్నిసార్లు అలా జరిగిపోతుందంతే...
ఈ పరాజయం నుంచి టీమిండియా క్రికెటర్లు పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నా. నేటితరంతో పోలిస్తే, నా తరంలో వరల్డ్ కప్ టోర్నీమెంట్స్ ఎప్పుడో కానీ ఉండేవి కావు. ఇప్పుడు ప్రతీ ఏటా జరుగుతున్నాయి...
వచ్చే 8 ఏళ్లల్లో 8 ఐసీసీ టోర్నీలు ఉన్నాయి. కాబట్టి ఇది వారికి చక్కని అవకాశం. ఆస్ట్రేలియాలో బాగా ఆడతారని ఆశిస్తున్నా. టీమిండియాలో టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు..
మ్యాచ్ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల ప్లేయర్లు కూడా పుష్కలంగా ఉన్నారు. కానీ ఈ వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం వాళ్లు సరిగా ఆడలేకపోయారు...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...