మయాంక్ అగర్వాల్ అవుట్, క్రీజులోకి శుబ్మన్ గిల్... భారీ ఆధిక్యం దిశగా టీమిండియా...
Mumbai Test: 62 పరుగుల వద్ద అవుటైన మయాంక్ అగర్వాల్... రెండేళ్ల తర్వాత సిక్సర్ బాదిన ఛతేశ్వర్ పూజారా... భారత జట్టుకి 370+ పరుగుల ఆధిక్యం...
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పూర్తి పట్టు సాధిస్తోంది. ఓవర్నైట్ స్కోరు 69/0 వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, ఆరంభంలో దూకుడుగా ఆడింది. మొదటి 5 ఓవర్లలో 30 పరుగులు రాబట్టిన పూజారా, మయాంక్ అగర్వాల్ ధాటిగా బ్యాటింగ్ చేశారు. రెండో రోజు మొదటి ఓవర్ వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్లో రెండు ఫోర్లు బాదాడు పూజారా...
ఇదీ చదవండి: ఆర్సీబీ కోచ్గా ఏబీ డివిల్లియర్స్... విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ 2022 సీజన్లో...
మయాంక్ అగర్వాల్ కంటే ఛతేశ్వర్ పూజారా దూకుడుగా ఆడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అజాజ్ పటేల్ బౌలింగ్లో సిక్సర్ బాదాడు పూజారా. జిడ్డు బ్యాటింగ్ చేసే పూజారా సిక్సర్ బాదడం, రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. మొదటి వికెట్కి 107 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 108 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 62 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ను అజాజ్ పటేల్ అవుట్ చేయడం విశేషం...
అజాజ్ పటేల్ బౌలింగ్లో విల్ యంగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మయాంక్. తొలి ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్, రెండో ఇన్నింగ్స్లోనూ న్యూజిలాండ్కి తొలి వికెట్ అందివ్వడం విశేషం...
తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్, రెండో ఇన్నింగ్స్లోనూ 50+ స్కోరు నమోదు చేసి... ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత ఓపెనర్గా రికార్డు క్రియేట్ చేశాడు. 1978లో చేతన్ చౌహన్, సునీల్ గవాస్కర్, 1987లో కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ ఫీట్ సాధించారు.
ముంబై వాంఖడే స్టేడియంలో తొలి ఇన్నింగ్స్లో 150, రెండో ఇన్నింగ్స్లో 50 పరుగులు చేసిన రెండో భారత ఓపెనర్గా నిలిచాడు మయాంక్ అగర్వాల్. ఇంతకుముందు సునీల్ గవాస్కర్ ఒకక్కడే ఈ ఫీట్ సాధించాడు...
ఆరంభంలో మయాంక్ అగర్వాల్ కంటే వేగంగా పరుగులు చేసి 57 బంతుల్లో 41 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, ఆ తర్వాత తన స్టైల్లో జిడ్డు బ్యాటింగ్తో విసిగించాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 47 పరుగులు చేసిన పూజారా కూడా అజాజ్ పటేల్ బౌలింగ్లోనే రాస్ టేలర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
తొలి ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేస్తూ రెండు సార్లు గాయపడిన శుబ్మన్ గిల్, వన్డౌన్ ప్లేయర్గా క్రీజులోకి వచ్చాడు. మూడు రోజు అంపైర్లు ఇచ్చిన రెండు నిర్ణయాలు తప్పుగా తేలడం విశేషం. మయాంక్ అగర్వాల్ను టిమ్ సౌథీ బౌలింగ్లో అవుట్గా ప్రకటించాడు అంపైర్. వెంటనే రివ్యూ తీసుకోగా, రిప్లైలో బాల్, బ్యాటుకి తగిలినట్టు స్పష్టంగా కనిపించింది.
అలాగే అజాజ్ పటేల్ బౌలింగ్లో ఛతేశ్వర్ పూజారానిి ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు అంపైర్. పూజారా వెంటనే డీఆర్ఎస్ తీసుకోగా బంతి, వికెట్ల పై నుంచి వెళ్తున్నట్టుగా కనిపించింది.
Read also: టీ20 వరల్డ్ కప్లో అందుకే ఓడిపోయాం... భారత జట్టు ప్రదర్శనపై సౌరవ్ గంగూలీ కామెంట్స్...
అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 10కి 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్, ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే కుప్పకూలింది. టీమిండియాకి తొలి ఇన్నింగ్స్లో 263 పరుగుల భారీ ఆధిక్యం దక్కినా, ఫాలోఆన్ తీసుకోకుండా తిరిగి బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది టీమిండియా.