India vs England: హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక అభిమాని సెక్యూరిటీని బ్రేక్ చేసి గ్రౌండ్ లోకి ప్రవేశించి.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
India vs England - Rohit Sharma : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ప్రారంభం అయింది. అయితే, ఆట తొలిరోజు ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. జాక్ క్రాలీ, బెన్ డకెట్ తొలి వికెట్కు 55 పరుగులు జోడించారు. 35 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్లో డకెట్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అలీ పోప్ ఒక పరుగు వద్ద అవుట్ కాగా, జాక్ క్రాలీ 20 పరుగుల వద్ద అశ్విన్ బంతికి సిరాజ్ క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఆటగాళ్లు ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు కోల్పోగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం ప్రశాంతంగా ఆడి 88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ 64.1 ఓవర్లు ఆడి 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
బౌలింగ్ విషయానికొస్తే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఇందులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. జైస్వాల్ ఆరంభం నుంచే తనదైన ఆటతీరును అదరగొట్టాడు. ఇంగ్లండ్ అరంగేట్రం ఆటగాడు టామ్ హార్ట్లీ వేసిన తన తొలి ఓవర్లో 2 సిక్సర్లు బాదాడు. హార్ట్లీ కేవలం 9 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చాడు.
అయితే, మ్యాచ్ తొలి రోజు భారత్ బ్యాటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. విరాట్ కోహ్లీ పేరుతో జెర్సీని ధరించిన ఒక అభిమాని అక్కడి సెక్యూరిటీని బ్రేక్ చేసిన గ్రౌండ్ లోకి ప్రవేశించాడు. అలాగే, రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి అతని పాదాలను తాకాడు. వెంటనే అక్కడి సిబ్బంది హిట్ మ్యాన్ అభిమానిని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 27 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేతికి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ఇందులో జైస్వాల్ 70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76*, శుభ్ మన్ గిల్ 14* పరుగులతో నాటౌట్గా ఉన్నారు. అయితే, రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన తొలి సెషన్ లోనే జైస్వాల్ 80 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
