Womens World Cup 2025 schedule: మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంకలో ఐదు వేదికల్లో నిర్వహించనున్నారు. పాక్ జట్టు మ్యాచ్లు కొలంబోలో జరుగుతాయి.
Womens World Cup 2025 schedule : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మహిళల వన్డే ప్రపంచకప్ 2025 షెడ్యూల్ను సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ను సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్-శ్రీలంకలోని ఐదు వేదికల్లో నిర్వహించనున్నారు. ఈసారి ప్రపంచకప్కు భారత్ లోని నాలుగు వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అలాగే, శ్రీలంకలోని కొలంబో ఒక వేదికగా ఎంపిక అయింది.
ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ మహిళల జట్టు తమ అన్ని మ్యాచ్లను శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. పాకిస్తాన్ భారత్ లో ఆడటానికి నిరాకరించడంతో ఆ జట్టు మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయి. గత డిసెంబర్లో ఐసీసీ ప్రకటించిన ప్రకారం, 2024-2027 సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లు న్యూట్రల్ వేదికలపై జరుగుతాయి.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 వేదికలు
• ఎం. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)
• ఏసీఏ స్టేడియం (గౌహతి)
• హోల్కర్ స్టేడియం (ఇండోర్)
• ఏసీఏ-వీడీసీఏ స్టేడియం (విశాఖపట్నం)
• ఆర్. ప్రేమదాస స్టేడియం (కొలంబో, శ్రీలంక)
భారత్ మ్యాచ్ తో మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరులో భారత్ పాల్గొనే మ్యాచ్తో ప్రారంభమవుతుంది. తొలి సెమీ ఫైనల్ అక్టోబర్ 29న గౌహతి లేదా కొలంబోలో, రెండవ సెమీ ఫైనల్ అక్టోబర్ 30న బెంగళూరులో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న బెంగళూరు లేదా కొలంబోలో నిర్వహించనున్నారు. ఐసీసీ ప్రకారం, నాకౌట్ మ్యాచ్ల కోసం కొలంబోను బ్యాకప్ వేదికగా కూడా నిర్ణయించారు.
పాకిస్తాన్ మహిళల జట్టు ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన వన్డే క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ఐదు మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి అజేయంగా ప్రపంచకప్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ రెండవ జట్టుగా అర్హత సాధించింది. ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, థాయిలాండ్ జట్లు అర్హత సాధించలేకపోయాయి.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 లో పాల్గొనే ఎనిమిది జట్లు ఇవే
1. భారత్
2. ఆస్ట్రేలియా
3. ఇంగ్లాండ్
4. దక్షిణాఫ్రికా
5. న్యూజిలాండ్
6. శ్రీలంక
7. బంగ్లాదేశ్
8. పాకిస్తాన్
కాగా, 2022 మహిళల ప్రపంచకప్ను న్యూజిలాండ్లో ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. ఇప్పటివరకు ఏడు సార్లు టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా మహిళల జట్టు ఈసారి కూడా డిఫెండింగ్ చాంపియన్గా టోర్నీకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.