India Vs South Africa 3rd ODI: ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికాకు వచ్చిన టీమిండియాకు  ఈ పర్యటనలో ఇదే ఆఖరు మ్యాచ్. ఇప్పటికే టెస్టులతో పాటు వన్డే సిరీస్ కూడా కోల్పోయిన టీమిండియా.. ఈ వన్డేలో అయినా పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. 

దక్షిణాఫ్రికా పర్యటన ముగింపు దశకు చేరుకున్నది. సౌతాఫ్రికాలోనే పుట్టిన ఒమిక్రాన్ కారణంగా అసలు ఈ సిరీస్ జరుగుతుందా..? లేదా..? అని ఎన్నో అనుమానాలు, ఆందోళనల నడుమ ప్రారంభమై ఫ్రీడమ్ సిరీస్ నేటితో ముగియనున్నది. దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఇప్పటికే టెస్టు సిరీస్ ను 2-1 తో పాటు వన్డే సిరీస్ ను కూడా 2-0 తో కోల్పోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఈ మ్యాచులో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తున్నది. 

ఇప్పటికే సిరీస్ కోల్పోవడంతో నామమాత్రంగా భావిస్తున్న ఈ మ్యాచులో భారత జట్టు నాలుగు మార్పులు చేసింది. గత రెండు మ్యాచులలో ఆడిన అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ లకు ఈ మ్యాచులో విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, దీపక్ చాహర్ లు తుది జట్టులోకి వచ్చారు. 

Scroll to load tweet…

ఇక సౌతాఫ్రికా జట్టులో ఒక మార్పు చేసినట్టు ఆ జట్టు సారథి తెంబ బవుమా చెప్పాడు. స్పిన్నర్ షంషీ స్థానంలో ప్రిటోరియస్ ను తుది జట్టులోకి తీసుకున్నట్టు బవుమా వెల్లడించాడు. 

సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో పరువు దక్కించుకోవడంతో పాటు బెంచ్ ను పరీక్షించడానికి భారత్ కు ఇది చక్కటి అవకాశం. నేటితో ముగియనున్న ఈ పర్యటన ఆఖరు మ్యాచులో అయినా విరాట్ కోహ్లి రాణిస్తాడో లేదోనని అతడి అభిమానులు వేచి చూస్తున్నారు. 

భారత జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ 

దక్షిణాఫ్రికా జట్టు : జె. మలన్, క్వింటన్ డికాక్, తెంబ బవుమా (కెప్టెన్), మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డసెన్, డేవిడ్ మిల్లర్, పెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, సిసంద మగల, డ్వేన్ ప్రిటోరియస్