Ind Vs Nz: పాపం హర్షల్ పటేల్.. అదృష్టం అడ్డం తిరిగితే అంతే మరి.. అలా చేసిన రెండో క్రికెటర్ గా చెత్త రికార్డు
Harshal Patel: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కోల్కతాలో జరిగిన నిన్నటి మ్యాచుల్ హర్షల్ పటేల్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాణించాడు. కానీ..
పొట్టి ప్రపంచకప్ లో ఎదురైన పరాభావానికి టీమిండియా న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. నెల రోజులు తిరగకముందే ఆ జట్టు పై టీ20 సిరీస్ నెగ్గింది. జైపూర్, రాంచీతో పాటు ఆదివారం ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఆఖరు టీ20లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. అయితే రాంచీ టీ20తో టీమిండియాకు అరంగ్రేటం చేసిన యువ ఆటగాడు హర్షల్ పటేల్.. నిన్నటి మ్యాచులో తాను కోరుకోని ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చిన హర్షల్.. హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అయితే టీ20 క్రికెట్ లో హిట్ వికెట్ గా వెనుదిరిగిన రెండో టీమిండియా బ్యాటర్ హర్షల్ పటేల్. అంతకుముందు ఈ చెత్త రికార్దు భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ పేరు మీద ఉండేది.
ఆదివారం నాటి మ్యాచులో 19 వ ఓవర్లో హర్షల్ ఇలా అవుటయ్యాడు. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లంతా అవుటైన నేపథ్యంలో బ్యాటింగ్ కు వచ్చిన హర్షల్.. ఓ సిక్స్ కొట్టి ఊపు మీదే కనిపించాడు. అప్పటికే 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. లాకీ ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో ఓ బంతిని కట్ షాట్ కు యత్నించిన హర్షల్.. హిట్ వికెట్ అయ్యాడు. క్రీజు లోపలికి వచ్చి ఆడటంతో అతడి బ్యాటు కాస్తా వికెట్లకు తాకడంతో బెయిల్స్ కిందపడిపోయాయి. దీంతో అతడు పెవిలియన్ కు చేరాడు.
అంతకుముందు ఈ రికార్డు టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ పేరిట ఉండేది. 2018లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచులో రాహుల్.. ఇలాగే హిట్ వికెట్ గా వెనుదిరిగి పొట్టి ఫార్మాట్ లో అలా అవుటైన తొలి భారత బ్యాటర్ గా చెత్త రికార్డు నమోదుచేశాడు. ఇక ఇప్పుడు హర్షల్ పటేల్ అ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
ఇక నిన్నటి మ్యాచులో ఛాంపియన్ లా ఆడిన అన్ని విభాగాల్లో అదరగొట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్నుంచింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (56), ఇషాన్ కిషన్ (29) దుమ్మురేపారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ దాటించారు. వీళ్ల ధాటికి పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఆ తర్వాత కాస్త తడబడినా.. ఆఖర్లో లోయరార్డర్ కూడా విజృంభించి ఆడటంతో న్యూజిలాండ్ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
అయితే ఛేదనలో ఆ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా ఆడలేదు. గప్తిల్ మినహా ఇతర ఆటగాళ్లెవరూ క్రీజులో నిలదొక్కుకోవడానికే ఇబ్బంది పడ్డారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 9 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ 111 పరుగులకే చాప చుట్టేసింది. దీపక్ చాహర్, చాహల్, అయ్యర్ తలో వికెట్ తీయగా.. హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా భారత్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది.