T20 World Cup: కర్మ ఫలం అనుభవించాల్సిందే..! సోషల్ మీడియాలో ఆ పాక్ ఆటగాడికి చురకలంటిస్తున్న ఇండియన్ ఫ్యాన్స్
Aus Vs Pak: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ డైలాగ్ ను ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ పాకిస్థాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిదికి బోధిస్తున్నారు. విజయగర్వం పనికిరాదు.. అని హెచ్చరిస్తున్నారు.
‘కర్మ అంటే ఇదేనేమో..!’ అంటూ పాకిస్థాన్ ఆటగాడు షహీన్ షా అఫ్రిదికి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. విజయగర్వంతో పొంగిపోకూడదని హితబోధ చేస్తున్నారు. ఒకటి రెండు మ్యాచుల్లో గెలిచి.. ఉప్పొంగితే అది మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..! అంటూ సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ సెమీస్ లో భాగంగా గురువారం రాత్రి ఆస్ట్రేలియాతో తలపడిన పాకిస్థాన్.. 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన పాక్.. సెమీస్ మెట్టుపై చతికిలపడింది. 19వ ఓవర్ వేసిన షహీన్ అఫ్రిది బౌలింగ్ లో మాథ్యూ వేడ్.. వీర బాదుడుతో పాక్ గుండె పగిలింది. అయితే నిన్నామొన్నటి దాకా తన బౌలింగ్ ప్రదర్శనతో అందరి మెప్పు పొందిన అఫ్రిది.. ఇప్పుడు దారుణంగా ట్రోల్ అవుతున్నాడు.
ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ అయితే అఫ్రిదిని బంతాట ఆడుకుంటున్నారు. ఈ టోర్నీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో అఫ్రిది మూడు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో తొలి ఓవర్లోనే రోహిత్ శర్మను ఔట్ చేసిన అఫ్రిది.. ఆ తర్వాత కెఎల్ రాహుల్ ను.. ఇన్నింగ్స్ చివర్లో విరాట్ ను పెవిలియన్ కు పంపాడు. ఇది గొప్ప ప్రదర్శనే గానీ.. ఇటీవల అతడు చేసిన పని టీమిండియా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పింది.
స్కాట్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న అఫ్రిది.. విరాట్, రోహిత్, రాహుల్ ఔటైన విధానాన్ని అనుకరించాడు.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా అక్కడున్న పలువురు అభిమానులు అతడిని చూస్తూ.. ముగ్గురు భారత బ్యాటర్ల పేర్లను పిలుస్తుండగా అఫ్రిది వారి కోరిక మేరకు ఆ ముగ్గురూ తన బౌలింగ్ లో ఎలా అవుటయ్యారో చేసి చూపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
అయితే పెద్దలు చెప్పినట్టు టైం ఎప్పుడూ మనది కాదు. ఇండియా సూపర్-12 దశలోనే ఇంటికి వచ్చినా పాక్ మాత్రం సెమీస్ కు చేరింది. ఆ జట్టు ఫైనల్ కు చేరడం పక్కా అని.. ఈసారి కప్పు పాకిస్థాన్ కే అని ఆ దేశానికి చెందిన అభిమానులు విర్రవీగారు. ఆసీస్ తో మ్యాచ్ లో ఆఖరుదాకా వాళ్లదే ఆధిపత్యం. కానీ.. టీ20 లో ఏదైనా సాధ్యమే. వేడ్, స్టాయినిస్ ల ఆట పాక్ కు తీరని వేదనను మిగిల్చింది.
ఇది కూడా చదవండి: T20 World Cup: ఆ ముగ్గురు టీమిండియా ఆటగాళ్లను దారుణంగా ట్రోల్ చేసిన అఫ్రిది.. ఫైర్ అవుతున్న ఇండియన్ ఫ్యాన్స్
19వ ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్ లో వేడ్ చివరి మూడు బంతులను సిక్సర్లుగా మలిచి ఆసీస్ కు విజయాన్ని ఖాయం చేశాడు. చివరి సిక్సర్ తర్వాత అఫ్రిది.. దిగాలుగా కూర్చునిపోయాడు. ఇప్పుడు ఇదే ఫోటోను ఉపయోగించి టీమిండియా ఫ్యాన్స్ అతడికి కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదని.. విజయగర్వం పనికిరాదని హితబోధ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలని, అప్పుడే అసలు విజయమని సూచిస్తున్నారు.