T20 World Cup: ఆ ముగ్గురు టీమిండియా ఆటగాళ్లను దారుణంగా ట్రోల్ చేసిన అఫ్రిది.. ఫైర్ అవుతున్న ఇండియన్ ఫ్యాన్స్
Shaheen Afridi: గత నెల 24న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు అఫ్రిది బౌలింగ్ లోనే ఔటయ్యారు. స్కాట్లాండ్ తో పోరు సందర్భంగా అఫ్రిది.. టీమిండియా బ్యాటర్లు ఔటైన విధానాన్ని దారుణంగా ట్రోల్ చేశాడు.
టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో భాగంగా గతనెల 24న చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన కీలక పోరులో టీమిండియా (Team India) దారుణ పరాజయం పాలైంది. ప్రపంచకప్ లో భారత నిష్క్రమణకు ఒకరకంగా ఈ ఓటమే పునాధి వేసింది. పాక్ (pakistan) తో పోరు అనంతరం న్యూజిలాండ్ (New Zealand) తో మ్యాచ్ కూడా భారత్ చిత్తుగా ఓడింది. అయితే ఇండియా-పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులో భారత్ ను ఆదిలోనే దెబ్బతీసి.. మన ఓటమిని ముందే ఖాయం చేసిన పాక్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది (Shaheen Afridi).. ఆ మ్యాచ్ లో ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లను ఔట్ చేసిన విధానాన్ని మిమిక్రీ చేశాడు. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లైన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అఫ్రిది కే ఔటయ్యారు. వీళ్లు ఔటైన విధానాన్ని అఫ్రిది దారుణంగా ట్రోల్ చేశాడు.
ఈనెల 7న స్కాట్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా అఫ్రిది. విరాట్, రోహిత్, రాహుల్ ఔటైన విధానాన్ని ట్రోల్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా అక్కడున్న పలువురు అభిమానులు అతడిని చూస్తూ.. ముగ్గురు భారత బ్యాటర్ల పేర్లను పిలుస్తుండగా అఫ్రిది వారిని అనుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నది.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్, రోహిత్, రాహుల్ లు అఫ్రిది బౌలింగ్ లోనే ఔటయ్యారు. అఫ్రిది.. తొలి ఓవర్లోనే రోహిత్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా రాహుల్ ను బౌల్డ్ చేశాడు. ఆఖర్లో కోహ్లి కూడా ఫుల్ షాట్ కు యత్నించి కీపర్ రిజ్వాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక స్కాట్లాండ్ తో పోరులో స్టేడియంలోని పలువురు అభిమానులు రోహిత్ శర్మ పేరు అరవగా.. అఫ్రిది అతడు ఔటైన విధానాన్ని చేసి చూపించాడు. ఆ తర్వాత రాహుల్.. విరాట్ పేర్లను బిగ్గరగా అరవగా.. అఫ్రిది వారిని కూడా భారత ఆటగాళ్లను ఎగతాళి చేసే విధంగా ప్రవర్తించాడు. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. పాక్ క్రికెటర్లు, అభిమానులు ఈ విధంగా వికృతానందం పొందుతున్నారని ఫైర్ అవుతున్నారు.
కాగా.. భారత్ తో మ్యాచ్ తర్వాత అఫ్రిది పెద్దగా రాణించింది లేదు. ఇప్పటివరకు 5 మ్యాచులాడిన అఫ్రది.. 6 వికెట్లు మాత్రమే తీశాడు. అందులో భారత్ తో తీసినవే మూడు వికెట్లు. తర్వాత మ్యాచులలో పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు మాత్రం దక్కడం లేదు. ఇదిలాఉండగా.. గ్రూప్-2 లో వరుసగా ఐదు విజయాలతో సెమీస్ చేరిన పాకిస్థాన్.. రేపు ఆస్ట్రేలియాతో తలపడుతున్నది. దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచినవాళ్లే ఫైనల్స్ కు పయనమవుతారు. ఓడితే ఇంటికే..