Asianet News TeluguAsianet News Telugu

అజర్ అధ్యక్షతన తొలి అంతర్జాతీయ మ్యాచుకు ఆతిథ్యమివ్వనున్న హైదరాబాద్

కళంకిత క్రికెటర్‌గా మరక తుడుచుకునే పనిలో పడిన అజహరుద్దీన్‌, హెచ్‌సీఏలో అవినీతి అంతం చూసేందుకు వచ్చానని పదవీలోకి వచ్చిన అనంతరం పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడి సౌరభ్‌ గంగూలీతో సాన్నిహిత్యంతో అజహరుద్దీన్‌కు ఇప్పుడు బీసీసీఐలోకి మంచి గుర్తింపు లభిస్తోంది. 

hyderabad to host first international match under the reigns of azharuddin
Author
Hyderabad, First Published Nov 29, 2019, 11:46 AM IST

సూపర్‌ బ్యాట్స్‌మన్‌గా అంతర్జాతీయ సర్క్యూట్‌లో స్టార్‌ ఇమేజ్‌. విజయవంతమైన కెప్టెన్‌గా భారత క్రికెట్‌లో మంచి పేరు. కెరీర్‌ ఉజ్వల స్థితిలో పరుగులు పెడుతున్న తరుణంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు మహ్మద్‌ అజహరుద్దీన్‌ కెరీర్‌ను వెనక్కి లాగింది. 

జాతీయ జట్టుకు దూరం కావటమే కాదు క్రికెటర్‌గా, వ్యక్తిగా ఎంతో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. న్యాయస్థానంలో అజహరుద్దీన్‌కు ఊరట లభించినా, భారత క్రికెట్‌ బోర్డు వర్గాలు అజహరుద్దీన్‌ను ఎన్నడూ దూరంగానే ఉంచాయి. 

ఓ రంజీ సీజన్‌లో ఢిల్లీ జట్టు డ్రెస్సింగ్‌రూమ్‌ను అజహరుద్దీన్‌ సందర్శించిన ఘటనపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోవడాన్ని బట్టి అజహరుద్దీన్‌పై బోర్డు వైఖరిని చెప్పకనే చెప్పవచ్చు. రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికైన అజహరుద్దీన్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. 

ఇప్పుడు క్రీయాశీల రాజకీయాలకు దూరమైనా.. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధ్యక్ష పగ్గాలు అందుకున్నాడు. జస్టిస్‌ లోధా కమిటీ బీసీసీఐ సహా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలను మాజీ క్రికెటర్లు నడపాలని అభిలాశించింది. 

Also read: దేవుడు అవకాశం ఇచ్చాడు... అజారుద్దీన్ కి రాయుడు సూచన

కళంకిత క్రికెటర్‌గా మరక తుడుచుకునే పనిలో పడిన అజహరుద్దీన్‌, హెచ్‌సీఏలో అవినీతి అంతం చూసేందుకు వచ్చానని పదవీలోకి వచ్చిన అనంతరం పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడి సౌరభ్‌ గంగూలీతో సాన్నిహిత్యంతో అజహరుద్దీన్‌కు ఇప్పుడు బీసీసీఐలోకి మంచి గుర్తింపు లభిస్తోంది. 

ఈ తరుణంలో రెబల్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు చేసిన అవినీతి ఆరోపణలు అజహరుద్దీన్‌ను వ్యక్తిగతంగా ఇరుకున పెట్టాయి. ఎన్నికల హామీల్లో భాగంగా సీనియర్‌ జట్టు కోచ్‌ పదవిని అర్హత లేని వారికి కట్టబెట్టడం.. డబ్బు, పవర్‌ ఆధారంగానే సీనియర్‌ జట్టులోకి ఎంపిక చేయడాన్ని అంబటి రాయుడు తీవ్రంగా తప్పుపట్టాడు. 

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో అవినీతి కథ అంతం చూడండి అంటూ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావుకు ట్విటర్‌లో విన్నవించాడు. రాయుడు ట్వీట్‌ హెచ్‌సీఏ వర్గాల్లో కలవరపాటుకు కారణమైంది.

సమయం వచ్చినప్పుడు స్పందిస్తాను... ఇప్పుడు కాదు!

డిసెంబర్‌ 6న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, వెస్టిండీస్‌లు తొలి టీ20లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఏర్పాట్లపై హెచ్‌సీఏ మీడియా సమావేశం నిర్వహించింది. 

అంబటి రాయుడు ఆరోపణల నేపథ్యంలో సహజంగానే అజహరుద్దీన్‌ నుంచి వివరణ ఆశించారు. కానీ మహ్మద్‌ అజహరుద్దీన్‌ నిర్మోహమాటంగా రాయుడు వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించాడు. ' క్రికెట్‌ ఆడిన వారి కంటే క్రికెట్‌ గొప్పది. డిసెంబర్‌ 6న ఉప్పల్‌లో తొలి టీ20 జరుగనుంది. 

ఈ సమయంలో మా దృష్టిని ఇతర అంశాలపైకి వెళ్లనీయం. క్రికెట్‌ ముందు మిగతా అన్ని అంశాలూ చిన్నవే. అవసరం అనుకుంటే భారత్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇతర అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడతాను' అని మహ్మద్‌ అజహరుద్దీన్‌ పేర్కొన్నాడు.


ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా... 

క్రికెటర్‌గా ఎన్నో మ్యాచులు ఆడానని క్రికెట్‌ పరిపాలకుడిగా ఇదే నాకు తొలి మ్యాచ్‌ అని అన్నాడు. అందుకే ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు.  ముంబయి క్రికెట్‌ సంఘం, బీసీసీఐ నుంచి అభ్యర్థన వచ్చింది. 

హైదరాబాద్‌ మూడో టీ20కి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నా, ఇతర కారణాల రీత్యా తొలి మ్యాచ్‌ను నిర్వహించాలని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ మద్దతుతో తొలి మ్యాచ్‌ నిర్వహించేందుకు అంగీకరించామని తెలిపారు. భారత్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి రానున్న ఔత్సాహిక అభిమానులకు హెచ్‌సీఏ అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. 

అన్ని స్టాండ్లలో సురక్షిత తాగు నీరు.. మహిళలు, పురుషులకు పరిశుభ్రమైన టాయిలెట్స్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు.  రాత్రి మ్యాచ్‌ వేళ దోమల బెడద ఉంటుంది కాబట్టి, మ్యాచ్‌కు ముందు రోజు నుంచే స్టేడియం లోపల సహా చుట్టు ప్రక్కల దోమల నివారణకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

Also read: అజరుద్దీన్ హెచ్ సిఎపై కేటీఆర్ కు అంబటి రాయుడు ఫిర్యాదు 

మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఏ ఒక్క అభిమాని ఇబ్బందికి గురి కాకూడదనే ధ్యేయంతో హెచ్‌సీఏ పని చేస్తుందని మహ్మద్‌ అజహరుద్దీన్‌ పేర్కొన్నాడు.
 

నేటి నుంచే టిక్కెట్ల అమ్మకాలు షురూ... 

డిసెంబర్‌ 6న ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న భారత్‌, వెస్టిండీస్‌ తొలి టీ20 మ్యాచ్‌కు నేటి నుంచి టికెట్లు అందుబాటులో ఉండను న్నాయి. ఈ మేరకు హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ టికెట్ల ధరలతో కూడిన ప్రకటన విడుదల చేశారు. 

హాస్పిటాలిటీతో కూడిన కార్పోరేట్‌ బాక్స్‌ల్లో ఒక టికెట్‌ ధర గరిష్టంగా రూ. 12,500గా నిర్ణయించారు. సౌత్‌, నార్త్‌ పెవిలియన్‌ టెర్రస్‌ల టికెట్లను రూ. 1000, రూ. 800గా నిర్ణయించారు. 

ఆన్‌లైన్‌ లోనూ టికెట్లను అభిమానులు కొనుగోలు చేయవచ్చని తెలిపారు.  సికింద్రాబాద్‌లోని జింఖాన మైదానం కౌంటర్‌ వద్ద సైతం అభిమానులు నేరుగా టికెట్లను పొందవచ్చని హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios