IPL 2025: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కుశాల్ మెండిస్ హిట్ వికెట్ గుజరాత్ గెలుపును దెబ్బకొట్టింది. అలాగే, కుశాల్ మెండిస్ ఐపీఎల్ అరంగేట్రంలో హిట్ వికెట్ గా అవుటైన తొలి క్రికెటర్గా నిలిచాడు.
IPL 2025: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో శ్రీలంక బ్యాట్స్మన్ కుశాల్ మెండిస్ అరుదైన రీతిలో అవుటయ్యాడు. గుజరాత్ టైటాన్స్ తరపున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న కుశాల్ మెండిస్ హిట్ వికెట్గా అవుటయ్యాడు. దీంతో ఐపీఎల్ అరంగేట్రంలో హిట్ వికెట్ గా అవుట్ అయిన తొలి క్రికెటర్గా నిలిచాడు. అంతేగాక, ప్లేఆఫ్ మ్యాచ్లో ఈ విధంగా అవుటైన తొలి ఆటగాడిగా కూడా చెత్త రికార్డును తన పేరుమీద రాసుకున్నాడు. అయితే, అతని హిట్ వికెట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కీలకసమయంలో అవుట్ అయిన కుశాల్ మెండిస్
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్, ఓపెనర్ శుభ్మన్ గిల్ వికెట్ ను త్వరగానే కోల్పోయింది. రెండో వికెట్కు కుశాల్ మెండిస్-సాయి సుదర్శన్ కలిసి 34 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
వీరిద్దరూ కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్తున్నారు. క్రీజులో కురుదుకున్న తర్వాత కుశాల్ మెండిస్.. మిచెల్ సాంట్నర్ వేసిన షార్ట్ డెలివరీని పుల్ చేసే ప్రయత్నంలో డీప్ మిడ్వికెట్కు బంతిని పంపించాడు. అయితే ఆ సమయంలో అతని వెనక కాలి స్టంప్స్ను తాకింది. దీంతో హిట్ వికెట్గా అవుటయ్యాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇది 18వ హిట్ వికెట్ అవుట్ కాగా, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ లలోనే ఇలా 6 సందర్భాల్లో హిట్ వికెట్ అవుట్ ఘటనలు జరిగాయి. ఐపీఎల్ 2025 సీజన్లో కుశాల్ మెండిస్ తో పాటు అభినవ్ మనోహర్, పాండ్యా కూడా హిట్ వికెట్గా అవుటయ్యారు. గతంలో 2016 సీజన్లో యువరాజ్ సింగ్, దీపక్ హుడా, డేవిడ్ వార్నర్లు కూడా అవుట్ అయ్యారు.
కుశాల్ మెండిస్ 10 బంతుల్లో 20 పరుగులు చేయగా, అందులో ఒక ఫోర్, రెండు సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్కు ముందు వికెట్ల వెనుక రెండు క్యాచ్లు వదిలేసిన మెండిస్.. బ్యాటుతో అద్భుతంగా ఆడే ప్రయత్నంలో దురదృష్టకరమైన హిట్ వికెట్ అవుట్తో పెవిలియన్ కు చేరాడు. కీలక సమయంలో కుశాల్ మెండిస్ అవుట్ కావడంతో గుజరాత్ బ్యాటింగ్ అర్డర్ పై ఒత్తిడి పెరిగింది.
గుజరాత్ టైటాన్స్ పై 20 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్
ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఎలిమినేటర్లో గుజరాత్ టిటాన్స్ (GT)పై ముంబై ఇండియన్స్ (MI) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ఈ మ్యాచ్తో ముగిసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి చేయగా, ఓపెనర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలు మంచి ఇన్నింగ్స్ లను ఆడారు. దీంతో 20 ఓవర్లలో ముంబై 228/5 పరుగులు చేసింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ 208/6 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 81 పరుగులు, సాయి సుదర్శన్ 80 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు.