గిల్ను కెప్టెన్గా చేయడం ద్వారా జట్టు ఎంపిక, వ్యూహరచన, ఇతర జట్టు వ్యవహారాలలో గంభీర్ మాటే ఫైనల్ అని సమాచారం.
ముంబై: భారత టెస్ట్ క్రికెట్లో పెద్ద మార్పులు జరుగుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. కొంతకాలంగా జట్టుకు ప్రధానంగా ఆదరణగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ సన్నివేశం నుంచి తప్పుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. వీరిద్దరి నిష్క్రమణతో భారత టెస్ట్ జట్టు పగ్గాలు పూర్తిగా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోకి వెళ్లనున్నాయని సమాచారం.
ఇదే క్రమంలో కొత్త కెప్టెన్ ఎంపికపై బీసీసీఐలో చర్చలు మొదలయ్యాయి. ఈ నిర్ణయంలో గంభీర్ పాత్ర ఎంతో కీలకంగా మారనుందని చెబుతున్నారు. గంభీర్ ఇప్పటికే భారత క్రికెట్లో సూపర్స్టార్ ప్రభావాన్ని తగ్గించే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జట్టును ముందుండి నడిపించిన రోహిత్, కోహ్లీల వెనుకడుగు వేయడంలో గంభీర్ దోహదపడినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పటికే జట్టులో ఉన్న అనుభవజ్ఞుడైన జస్ప్రీత్ బుమ్రా పేరు కెప్టెన్సీ దృష్టిలో ఉన్నప్పటికీ, యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ను ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బుమ్రాకు గాయాల సమస్యలు ఉండటమే కాక, గంభీర్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే వ్యక్తిగా గిల్ను చూసే అవకాశముందని సమాచారం. జట్టు ఎంపిక, వ్యూహాలు, అంతర్గత వ్యవహారాల్లో గంభీర్ అభిప్రాయం అంతిమమవుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి.
టెస్ట్ సిరీస్లలో వరుస వైఫల్యాల తర్వాత భవిష్యత్ లో మరింత క్రమశిక్షణ అవసరమన్న అభిప్రాయంతో బీసీసీఐని గంభీర్ ఒత్తిడి చేస్తున్నాడు. అదే కారణంగా తనకు సమగ్ర నియంత్రణ కలిగేలా గిల్ను కెప్టెన్గా సూచిస్తున్నాడని సమాచారం. బుమ్రా లాంటి సీనియర్ను కెప్టెన్ చేస్తే తాను తీసే నిర్ణయాలను ఆతడు ప్రశ్నించవచ్చన్న ఆలోచన కూడా గంభీర్ ఆందోళనకు కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో గిల్ చేతుల్లో టెస్ట్ జట్టు పగ్గాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇది గంభీర్ వ్యూహానికి అనుకూలంగా మారే మార్గమని విశ్లేషకుల అభిప్రాయం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.