Ravi Shastri: జట్టు ఎంపికకు సంబంధించిన అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంగ్లాండ్  విధానాన్ని ఫాలో అయితే బెటరని అంటున్నాడు. 

టీమిండియా ఆడే స్వదేశీ లేదా విదేశీ పర్యటనల్లో పాల్గొనబోయే జట్ల ఎంపికలకు సంబంధించిన అధికారం, ఆ ప్రక్రియ అంతా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్దలదే. ఈ విషయంలో బీసీసీఐ నియమించిన సెలక్టర్లు ఎంత చెబితే అంతే. వాళ్లు ఎవర్ని ఎంపిక చేస్తే వాళ్లు మాత్రమే జట్టులో ఉంటారు. జట్టు హెడ్ కోచ్, సారథి ఉన్నా వాళ్లకు ఆ అధికారం లేదు. ఎవరైనా కొత్త ఆటగాడు, దేశవాళీలో బాగా రాణిస్తున్న ఆటగాళ్ల గురించి కోచ్, కెప్టెన్ లు చెప్పే సూచనలు మాత్రమే సెలక్టర్లు తీసుకుంటారు. కానీ కోచ్, కెప్టెన్ ఇద్దరికీ సెలెక్టర్లు ఇచ్చిన జట్టును వ్యతిరేకించే అధికారం లేదు. అయితే ఈ ధోరణి మారాలంటున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. 

స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారమవుతున్న ‘బోల్డ్ అండ్ బ్రేవ్’ షో లో భాగంగా రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శాస్త్రి మాట్లాడుతూ.. ‘టీమ్ సెలెక్షన్ లో కోచ్, కెప్టెన్ లు భాగస్వాములు కావాలి. వాళ్లు కూడా మాట్లాడాలి. అనుభవజ్ఞుడైన కోచ్ ఉన్నప్పుడు ఇది చాలా అవసరం కూడా. రాహుల్ ద్రావిడ్, కెప్టెన్లు జట్టు ఎంపికలో పాలు పంచుకోవాలి..’ అని వ్యాఖ్యానించాడు.

Scroll to load tweet…

జట్టు ఎంపిక సమయంలో ఫోన్ల ద్వారానో, ఈ మెయిళ్ల ద్వారానో కోచ్, కెప్టెన్ ల అభిప్రాయాలు అడిగి తెలుసుకునే పద్ధతికి ఇక స్వస్థి పలకాలని, ఆ ఇద్దరూ కూడా సెలెక్షన్ కమిటీలో భాగస్వాములు అయ్యే విధంగా ఉంటే బాగుంటుందని శాస్త్రి చెప్పాడు. ఉదాహరణగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ను చూపించాడు. 

ఇంగ్లాండ్ లో ఏమైంది..? 

కొద్దిరోజుల క్రితం ఇంగ్లాండ్ లో సెలెక్షన్ కమిటీని రద్దు చేసి జట్టు ఎంపికను చీఫ్ కోచ్ సిల్వర్ వుడ్ తో పాటు టెస్టు, పరిమిత ఓవర్ల సారథులు ఇయాన్ మోర్గాన్, జో రూట్ కు ఇచ్చారు. వన్డే, టీ20 ల సంగతి ఎలా ఉన్నా టెస్టులలో మాత్రం ఆ జట్టు పేలవ ప్రదర్శనతో చతికిలపడింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ లో పలువురు మాజీ క్రికెటర్లు.. సెలెక్షన్ కమిటీని మళ్లీ పునరుద్ధరించాలని కోరుతున్నారు. 

ఇంగ్లాండ్ లో అట్టర్ ఫ్లాఫ్ అయిన ఈ ఐడియాను బీసీసీఐ ఎంత మేరకు అనుసరించగలుగుతుందనేది అనుమానమే. ఇటీవల కాలంలో టీమిండియా వన్డే కెప్టెన్సీ వివాదం గురించి జరిగిన చర్చలో కూడా ఈ అంశంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. తనను కెప్టెన్ గా తొలగిస్తున్నారనే విషయాన్ని గంటనర ముందు సెలెక్టర్లు ఫోన్ చేసి చెప్పారని, దాని గురించి తనకు ముందస్తు సమాచారమే ఇవ్వలేదని స్వయంగా కోహ్లినే వాపోయిన విషయం తెలిసిందే.