సొంతగడ్డపై గెలవడం పెద్ద గొప్పా..? అన్న న్యూజిలాండ్ క్రికెటర్.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన ఇండియన్ ఫ్యాన్స్
Ind Vs Nz: ముంబైలో ముగిసిన రెండో టెస్టులో భారత జట్టు.. కివీస్ ను 372 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్ క్రికెటర్ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది.
టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ఇటీవలే ముగిసిన రెండు టెస్టుల సిరీస్ ను విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు 1-0తో గెలుచుకుంది. వారం రోజుల క్రితం ముంబైలో ముగిసిన రెండో టెస్టులో భారత జట్టు.. కివీస్ ను 372 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. అంతేగాక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తిరిగి నెంబర్ వన్ పొజీషన్ కు చేరుకుంది. అయితే సొంతగడ్డపై గెలవడం పెద్ద గొప్ప కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ న్యూజిలాండ్ క్రికెటర్ చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది. దీనికి భారత క్రికెట్ అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ మెక్క్లీన్గన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా ఉన్న న్యూజిలాండ్ ను టీమిండియా సొంతగడ్డపై తమకు అనుకూలమైన పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఓడించింది. శుభాకాంక్షలు..’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ఇదే మన నెటిజనులకు ఆగ్రహాన్ని తెప్పించింది.
మెక్క్లీన్గన్ ట్వీట్ కు రిప్లైలు ఇస్తూ... ‘న్యూజిలాండ్ కు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడని వ్యక్తి విమర్శలు చేస్తున్నాడు..’, ‘స్వదేశంలో ఎవరైనా బెబ్బులే.. కావాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కు వెళ్లి చూడు తెలుస్తుంది..’, ‘తొలి ఇన్నింగ్స్ లో వంద పరుగులు కూడా చేయలేదు.. మీరు మాట్లాడుతారా..?’ అంటూ ఫైర్ అయ్యారు. అంతేగాక.. ‘ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో మేం సిరీస్ లు నెగ్గాం. కానీ ఇంతవరకు మీ వరల్డ్ ఛాంపియన్స్ బయట ఒక్క సిరీస్ కూడా గెలువలేదు. ముందు రికార్డులు చూసి మాట్లాడు..’ అంటూ చురకలంటించారు.
న్యూజిలాండ్ తరఫున వన్డేలు, టీ20 లు మాత్రమే ఆడిన మెక్క్లీన్గన్.. ఇంతవరకూ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. ఈ కివీస్ ఆటగాడు.. 48 వన్డేలు, 29 టీ20లలో ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
మరో ట్వీటర్ స్పందిస్తూ.. ‘క్రికెట్ ఫ్యాన్ గా నీ ట్వీట్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ట్వీట్ చేసే ముందు ఏం చేస్తున్నావో కొంచెం చూసుకో..’ అని రాయగా.. మరో అభిమాని.. ‘న్యూజిలాండ్ క్రికెట్ అభిమానిగా నాకు మీ జట్టు మీద, కేన్ విలియమ్సన్ మీద గౌరవం ఉంది. కానీ నీ ట్వీట్ చూశాక నేను చాలా నిరాశకు గురయ్యాను. ఓటమిని ఒప్పుకోవడం.. ప్రత్యర్థులకు వారి విజయాల్లో క్రెడిట్ ఇవ్వడం గురించి కేన్ విలియమ్సన్ దగ్గర నేర్చుకుంటే మంచిది..’ అని కౌంటరిచ్చాడు.
టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ తో పాటు టెస్టు సిరీస్ కూడా కోల్పోయింది. కాన్పూర్ లో జరిగిన తొలి టెస్టులో ఆ జట్టు డ్రా తో గట్టెక్కినా.. రెండో టెస్టులో మాత్రం ఓటమిని తప్పించుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో స్సిన్నర్ అజాజ్ పటేల్ పది వికెట్లు తీసినా ఆ జట్టు ఓటమిని మాత్రం ఆపలేకపోయాడు. ఈ విజయంతో భారత్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభావానికి బదులు తీర్చుకుంది.