Drone crash near Rawalpindi stadium: PSL మ్యాచ్‌కు ముందు పాక్ లోని రావల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ కూలి రెస్టారెంట్ దెబ్బతింది. అలాగే, స్టేడియం పై కూడా ప్రభావం కనిపించిందని స‌మాచారం. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ ర‌ద్ద‌వుతుందా?  

Drone crash near Rawalpindi stadium: పాకిస్తాన్ లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో గురువారం ఒక డ్రోన్ కూలింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు సంభవించడంతో భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళనలు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఈ డ్రోన్ ప్రమాదం పేశావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చూస్తే పీఎస్ఎల్ పై ప్ర‌భావం ప‌డ‌నుంది. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ ర‌ద్దు అవుతుంద‌ని కూడా ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు ప్రకారం డ్రోన్ స్టేడియం సమీపంలోని ఒక రెస్టారెంట్ భవనంపై పడింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ ఒక భాగం దెబ్బతింది. ఇద్దరు పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు.

పాక్ అధికార వర్గాలు ఈ ప్రాంతాన్ని మూసివేసి డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో, ఇది పేలుడు పదార్థాలు మోస్తుందా అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించాయి. డ్రోన్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

రావల్పిండి క్రికెట్ స్టేడియంలో మే 8 రాత్రి 8 గంటలకు జరగాల్సిన పేశావర్ జల్మీ వర్సెస్ కరాచీ కింగ్స్ మ్యాచ్‌ను నిర్వహించే ముందు భద్రతా పరిస్థితులపై అనేక ప్రశ్నలు వెలువడ్డాయి. ఈ సంఘటనపై స్పందిస్తూ.. The Telegraph తెలిపిన వివరాల ప్రకారం, పీఎస్ఎల్‌లో పాల్గొంటున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు దేశంలోనే కొనసాగాలా లేక వెనక్కు వెళ్లాలా అనే విషయంలో భిన్నంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించింది.

అలాగే, లాహోర్, కరాచీ నగరాల్లో అనేక పేలుళ్లు సంభవించాయి. లాహోర్‌లోని వాల్టన్ రోడ్ ప్రాంతంలో మూడు వరుస పేలుళ్లు జరిగాయి. నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నగరంలో పొగలు ఆవరించాయి. అత్యవసర సేవల బృందాలు వెంటనే స్పందించాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా లాహోర్, సియాల్కోట్ విమానాశ్రయాల్లో వాణిజ్య విమానాలు గురువారం మధ్యాహ్నం వరకు నిలిపివేయబడ్డాయి.

భారత రక్షణ మంత్రిత్వశాఖ గురువారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో “ఈ ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఎయిర్ డిఫెన్స్ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. ఇది పాకిస్తాన్ దాడులకు సమాన స్థాయిలో భారత్ స్పందించిన చర్య. లాహోర్‌లో ఉన్న ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్టు విశ్వసనీయ సమాచారం అందింది” అని పేర్కొంది. ఈ పరిణామాలు భారత్-పాకిస్తాన్ మధ్య భద్రతా ఉద్రిక్తతలను మ‌రింత‌ పెంచుతున్నాయి.