WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ కు ముందు ముంబై వేదికగా సోమవారం నిర్వహించిన   ఆటగాళ్ల వేలం విజయవంతంగా ముగిసింది. వేలం నిర్వహించిన తీరుపై టీమిండియా వెటరన్  వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసలు కురిపించాడు.

మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం ముంబైలో జరిగిన వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ.. రాత్రి 9 గంటల దాకా సాగింది. మహిళా క్రికెటర్లను దక్కించుకోవడానికి ఐదు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. వేలంలో అందరి దృష్టి ఏ ఏ ఆటగాళ్లు ఎంత దక్కించుకుంటారు...? తమ అభిమాన టీమ్ ఎవరిని సొంతం చేసుకుంటుంది..? అన్న అంశాలతో పాటు వేలాన్ని నిర్వహించిన యాక్షనీర్ మల్లికా సాగర్ మీద కూడా పడింది.

తొలిసారి వేలంలో బీసీసీఐ.. మహిళా యాక్షనీర్ తోనే వేలం నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. ఆటగాళ్ల పేర్లను స్పష్టంగా చెప్పడం, ఫ్రాంచైజీలకు ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వడం.. తనకు ప్లేయర్ల జాబితాను అందించిన వారితో వ్యవహరించిన తీరు, ఆమె మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

ఇదే విషయమై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా స్పందించాడు. వేలం ముగిసిన తర్వాత కార్తీక్ తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ... ‘మల్లికా అద్భుతమైన యాక్షనీర్. చాలా స్పష్టంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డబ్ల్యూపీఎల్ లో సరైన ఎంపిక. వెల్‌డన్ బీసీసీఐ..’అని ప్రశంసలు కురిపించాడు.

Scroll to load tweet…

ముంబైకి చెందిన మల్లికా.. ఆర్ట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నది. ప్రస్తుతం ఆమె ఇండియా కన్సల్టెంట్ సంస్థలో ఆర్ట్ కన్సల్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నది. డబ్ల్యూపీఎల్ కంటే ముందు గతంలో ఆమె ప్రో కబడ్డీ లీగ్ వేలం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించింది.

ఇది కూడా చదవండి : 400 మందికి పైగా పోటీ పడితే వేలంలో దక్కించుకుంది 87 మందినే.. ఐదు జట్ల పూర్తి వివరాలివే..

 ఇక వేలంలో 400లకు పైగా ఆటగాళ్లు పోటీ పడగా వారిలో ఐదు ఫ్రాంచైజీలు 87 మందిని దక్కించుకున్నాయి. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రూ. 3.40 కోట్లతో రికార్డు ధర దక్కించుకుని తొలి వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్ గా రికార్డులకెక్కింది. మొత్తంగా ఐదు ఫ్రాంచైజీలు రూ. 60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా 87 మంది క్రికెటర్ల కోసం రూ. 59.50 కోట్లు వెచ్చించాయి. 

Scroll to load tweet…