Axar Patel: ఐపీఎల్ 2025 లో కీలకమైన మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టంగా మార్చుకుంది. డీసీ ఓటమిపై కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

IPL 2025 DC: గుజరాత్ టైటాన్స్ (జీటీ) చేతిలో ఓటమి తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ అక్షర్ పటేల్ ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌ను ప్రశంసించారు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిందని అన్నారు. లీగ్ దశలో వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోయిన డీసీ, ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జీటీ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ప్లేఆఫ్స్ చేరే అవకాశాల సమీకరణాలు మారాయి. 

డీసీ ఓటమిపై అక్షర్ పటేల్ కామెంట్స్

మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. “గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. మేము మంచి స్కోరు చేశామనుకున్నాం.  కేెఎల్ రాహుల్ బాగా ఆడాడు. వికెట్ల కోసం మా బౌలర్లు ప్రయత్నించారు కానీ అందులో సక్సెస్ కాలేకపోయాం. గత కొన్ని మ్యాచ్‌లతో పోలిస్తే మా బ్యాటింగ్ మెరుగైంది. ఫీల్డింగ్, పవర్‌ప్లే బౌలింగ్ మెరుగుపడాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బంతి బాగా వచ్చింది. మొదటి ఇన్నింగ్స్ లాగా బంతి స్టిక్ అవుతూ రాలేదు. వికెట్లు పడకపోవడంతో గుజరాత్ కు గెలుపు సులువైంది” అని అన్నారు.

కాగా, డీసీకి హోమ్ గ్రౌండ్‌లో రికార్డు బాగోలేదు. ఇక్కడ ఒక మ్యాచ్ సూపర్ ఓవర్‌లో గెలిచారు, నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయారు. బయట మైదానంలో ఐదు గెలిచి, ఒకటి ఓడిపోయారు, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.

డీసీ ఎలా ఓడిపోయింది?

IPL 2025 60వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డీసీ ఫాఫ్ డుప్లెసిస్ వికెట్ త్వరగా కోల్పోయింది. అయితే, కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 పరుగులు), అభిషేక్ పొరెల్ (19 బంతుల్లో 30 పరుగులు)లు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ పటేల్ (16 బంతుల్లో 25 పరుగులు) ట్రిస్టాన్ స్టబ్స్ (10 బంతుల్లో 21* పరుగులు) చివర్లో పరుగులు సాధించడంతో డీసీ 199/3 స్కోరు చేసింది. సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

అయితే, శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93* పరుగులు), సాయి సుధర్శన్ (61 బంతుల్లో 108* పరుగులు) జోడీ డీసీ బౌలర్లను చిత్తు చేసింది. వీరిద్దరూ 205 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జీటీని ఒక ఓవర్ మిగిలి ఉండగానే గెలిపించారు. సాయి సుదర్శన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

ఈ విజయంతో జీటీ తొమ్మిది విజయాలు, మూడు ఓటములతో 18 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. డీసీ ఆరు విజయాలు, ఐదు ఓటములతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.