సుమారు 30 ఏళ్ల తర్వాత పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తోంది ఐసీసీ. అయితే తొలి నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ విమర్శలు ఎదుర్కొంటోంది. స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న అన్ని దేశాల జెండాలను ఎగరవేసి, భారత జాతీయ జెండాను ప్రదర్శించలేదు. ఇది చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం పాకిస్థాన్లోని లాహోర్లో ఇంగ్లండ్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగే సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గడాఫీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్కి ముందు రెండు దేశాల జాతీయ గీతాలను ప్లే చేస్తారని తెలిసిందే. మొదట ఇంగ్లండ్ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. అయితే తర్వాత ఆస్ట్రేలియా జాతీయ గీతం ప్లే కావాల్సిన సమయంలో పొరపాటున భారత జాతీయ గీతం వినిపించింది.
కొన్ని సెకండ్ల పాటు భారత జాతీయ గీతం ప్లే అయ్యింది. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిర్వాహకులు వెంటనే ఈ పొరపాటును గుర్తించి భారత జాతీయ గీతాన్ని ఆపారు, వెంటనే మళ్లీ ఆస్ట్రేలియా గీతాన్ని ప్లే చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఓ రేంజ్లో సెటైర్లు విసురుతున్నారు.
'స్టేడియంలో జాతీయ జెండా లేకుండా చేశారు. కానీ భారత జాతీయ గీతం వినిపించింది' అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలోనే పాకిస్థాన్కు గట్టి షాక్ ఎదురైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లోనే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీ ఫైనల్ అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే ఇక కీలక ఆటగాడు ఫకర్ జమాన్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమవడం కూడా పాక్కి మరో దెబ్బ అని చెప్పొచ్చు. దీంతో ఆదివారం భారత్తో జరిగే మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో పాక్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం.
