12 దేశాల్లో వందకు పైగా పిల్లలున్న టెలిగ్రామ్ అధినేత పావెల్ డ్యూరోవ్, వాళ్లందరికీ తన 13 లక్షల కోట్ల ఆస్తిని పంచాలని నిర్ణయించుకున్నారు. ఆయను వంద మంది పిల్లలేంటి..వాళ్లకు ఆస్తిని పంచడమేంటి.. చదవండి మరి పూర్తి స్టోరీ  

వేగంగా పెరుగుతున్న యాప్స్‌లో టెలిగ్రామ్ ఒకటి. పావెల్ డ్యూరోవ్ దాని సహ వ్యవస్థాపకుడు, CEO. 2013లో తన సోదరుడు నికోలాయ్ డ్యూరోవ్‌తో కలిసి దీన్ని ప్రారంభించారు. ఫోర్బ్స్ ప్రకారం, 2024 నాటికి ఆయన ఆస్తి దాదాపు $15.5 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో 120వ ధనవంతుడు. 2023లో UAE లో అత్యంత ధనవంతుడైన వలసదారుడిగా గుర్తింపు పొందారు. ఆయన సంపద ఎక్కువగా టెలిగ్రామ్ నుంచే వచ్చింది. ఈ పావెల్ డ్యూరోవ్ కాస్త వింత మనిషి. 12 దేశాల్లో వందకు పైగా ఈయనకు పిల్లలున్నారట! 

అయితే ఆయన ఎక్కడికెళ్లినా అలాంటి పనులేమీ చేయలేదు. ముగ్గురు మహిళలతో ఆరుగురు పిల్లలున్నారు. మిగతా వంద మంది పిల్లలు వీర్యదానం ద్వారా పుట్టారు. గత 15 ఏళ్లుగా వీర్యదానం చేస్తున్నారాయన. దీనివల్ల వందకు పైగా పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, తన $13.9 బిలియన్ డాలర్ల ఆస్తిని ఈ వంద మంది పిల్లలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇది విని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.

బ్లూమ్‌బర్గ్ బిలియనైర్స్ ఇండెక్స్ ప్రకారం పావెల్ డ్యూరోవ్ ఆస్తి $13.9 బిలియన్ డాలర్లు. ఫ్రాన్స్‌కు చెందిన లె పాయింట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏళ్ల ఈ టెక్ దిగ్గజం తన ప్రణాళికను వెల్లడించారు. "నా పిల్లలు ఎలా పుట్టినా నాకేం తేడా లేదు. సహజంగా పుట్టినా, వీర్యదానం ద్వారా పుట్టినా వాళ్లంతా నా పిల్లలే. అందరికీ సమాన హక్కులుంటాయి. నా ఆస్తిలో వాళ్లందరికీ వాటా ఉంటుంది" అని పావెల్ డ్యూరోవ్ అన్నారు.

అయితే, తన పిల్లలు తన ఆస్తిని వాడుకోవడానికి ఇంకా 30 ఏళ్లు పడుతుందని డ్యూరోవ్ చెప్పారు. ఇటీవలే తన వీలునామా రాశానని, దాని ప్రకారం 30 ఏళ్ల వరకు తన పిల్లలు ఆస్తిని వాడుకోలేరని, ఆ తర్వాత వాళ్ల ఇష్టమని అన్నారు. టెక్నాలజీలో కొత్తదనం తీసుకొచ్చినందుకు డ్యూరోవ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినా, ఆయనపై కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. టెలిగ్రామ్ వేదికగా జరిగిన నేరాలకు ఆయన కూడా కారణమని ఫ్రెంచ్ అధికారులు గత ఏడాది ఆరోపించారు. అయితే డ్యూరోవ్ ఆ ఆరోపణలను ఖండించారు.