Stock Market: మార్కెట్ మానిప్యులేషన్ ఫిర్యాదుల మధ్య యూఎస్ కు చెందిన జేన్ స్ట్రీట్ సంస్థ భారత్‌ ఈక్విటీ డెరివేటివ్‌లతో 2.3 బిలియన్ డాలర్ల లాభం సాధించడంతో ఆ సంస్థపై సెబీ విచారణ ప్రారంభించింది.

Indian stock market - Jane Street: అమెరికాకు చెందిన ట్రేడింగ్ దిగ్గజం జేన్ స్ట్రీట్ గ్రూప్ లిమిటెట్ లయబిలిటీ కంపెనీ (Jane Street Group LLC)పై సెబీ విచారణ ప్రారంభించింది. జేన్ స్ట్రీట్ గ్రూప్ భారతదేశంలో ఈక్విటీ డెరివేటివ్‌ల ద్వారా 2024లో $2.3 బిలియన్ డాలర్లు ఆదాయం అందుకుంది. మార్కెట్ మానిప్యులేషన్ ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ట్రేడింగ్ లాభాలపై భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) జేన్ స్ట్రీట్ గ్రూప్ పై విచారణ ప్రారంభించింది.

బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం.. 2023తో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. న్యూయార్క్‌ కేంద్రంగా ఉన్న జేన్ స్ట్రీట్ సంస్థకు గ్లోబల్ రెవెన్యూలో ఒక్క భారత్ నుంచే 10% కంటే ఎక్కువ వాటా వచ్చింది. మొత్తం $20.5 బిలియన్ గ్లోబల్ ట్రేడింగ్ ఆదాయంలో ఇది పెద్దభాగంగా ఉంది.

సెబీ విచారణలో జేన్ స్ట్రీట్

ఈ భారీ లాభాల తర్వాత, మార్కెట్‌లో మ్యానిప్యులేషన్ జరిగింది అని కొంతమంది మార్కెట్ ట్రేడర్లు ఆరోపించడంతో SEBI అమెరికా సంస్థపై విచారణ ప్రారంభించింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) కూడా ఓ విడత విచారణ జరిపింది, అయితే జేన్ స్ట్రీట్ భారత ట్రేడింగ్ భాగస్వామి సమాధానంతో అది గత నెలలోనే ముగిసింది. త్వరలోనే జేన్ స్ట్రీట్ సంస్థ తమ లాభాల గురించి, అలాగే సెబీ విచారణపై వివరాలు అందించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కోవిడ్ తర్వాత ఆప్షన్ ట్రేడింగ్ పెరిగింది

కోవిడ్ మహమ్మారి తర్వాత భారతదేశంలో ఈక్విటీ ఆప్షన్స్ ట్రేడింగ్ బాగా పెరిగింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యధిక డెరివేటివ్ కాంట్రాక్టులు ట్రేడ్ అయ్యే మార్కెట్ గా మారింది. జేన్ స్ట్రీట్‌తో పాటు, సిటాడెల్ సెక్యూరిటీస్, ఆప్టివర్ వంటి గ్లోబల్ ట్రేడింగ్ సంస్థలు కూడా భారత మార్కెట్లోకి వచ్చాయి.

2020 నుండి 2025 మార్చి వరకు ఆప్షన్స్ ప్రీమియంలు 11 రెట్లు పెరిగాయి. SEBI అధ్యయనం ప్రకారం, 2023 మార్చి నుండి 2024 మార్చి వరకు జేన్ స్ట్రీట్ సహా విదేశీ, దేశీయ అల్గో సంస్థలు $7 బిలియన్ల లాభాలు సంపాదించాయి.

'సీక్రెట్' స్ట్రాటజీతో లాభాలు

2023లో, Millennium Management అనే సంస్థకు చెందిన కేసులో, జేన్ స్ట్రీట్ భారత మార్కెట్లో $1 బిలియన్ లాభాన్ని "సీక్రెట్ ట్రేడింగ్ స్ట్రాటజీ" ద్వారా సంపాదించిందని పరోక్షంగా బయటపడింది. టెక్నాలజీ ఆధారిత అల్గో ట్రేడింగ్, బ్యాంకింగ్ నియంత్రణలకు లోబడి లేకుండా స్వంత మూలధనంతో ట్రేడింగ్ చేయగల సామర్థ్యం వంటి అంశాలు జేన్ స్ట్రీట్‌కు ప్రత్యర్థులపై ఆధిక్యం అందించాయి. ప్రస్తుతం ఈ సంస్థ 18 దేశాల్లో 2%కు పైగా డెరివేటివ్ మార్కెట్ షేర్ కలిగి ఉంది. భారత్ కూడా ఇందులో ఒకటి.

రీటైల్ ఇన్వెస్టర్ల రక్షణలో సెబీ చొరవ

ఆప్షన్ ట్రేడింగ్ విపరీతంగా పెరగడం వల్ల 90% రీటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని గుర్తించిన సెబీ, 2023 నవంబరులో కొత్త నియంత్రణలు తీసుకువచ్చింది. వాటిలో అధిక కనిష్ట ఇన్వెస్ట్‌మెంట్ పరిమితులు, పెరిగిన లాట్ సైజులు ఉన్నాయి.

ఈ చర్యల వల్ల 2024 ఏప్రిల్ వరకు NSE ఆప్షన్ ట్రేడింగ్ ఫీజులు కేవలం 2% మాత్రమే పెరిగాయి, గత ఏడాది ఇదే కాలంలో 92% వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది. జేన్ స్ట్రీట్ లాభాలు, సెబీ చర్యలు ప్రస్తుతం భారత మార్కెట్లో ట్రేడింగ్ పద్ధతులపై మరోసారి చర్చకు దారితీశాయి.