ముచ్చటగా మూడోసారి! 8న బెయిల్ కోసం నీరవ్ మోడీ..
భారత్కు అప్పగింత విచారణను ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఈ నెల 8న బ్రిటన్ కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ను దాఖలు చేయనున్నారు.
లండన్: భారత్కు అప్పగింత విచారణను ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఈ నెల 8న బ్రిటన్ కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ను దాఖలు చేయనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను రూ.13,500 కోట్ల మేరకు మేనమామ - రత్నాల వ్యాపారి మెహుల్ చోక్సీతో కలిసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.
మార్చి 19 నుంచి జైలులోనే నీరవ్
ఈ ఏడాది మార్చి 19న నీరవ్ను స్కాట్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, అప్పట్నుంచి జైలులోనే ఉంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నీరవ్కు నిరాశే ఎదురవగా, ఇప్పుడు మూడోసారి ప్రయత్నిస్తున్నారు.
భారతదేశానికి అప్పగింత కేసులో కోర్టుకు హాజరు కానున్న నీరవ్ మోడీ
ఈ నెల 8న లండన్లోని వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా ఆర్బుత్నట్ ఎదుట భారత్కు అప్పగింత విచారణార్థం నీరవ్ హాజరు కానున్నారు.
ఈ సందర్భంగానే తన బెయిల్ పిటిషన్ను మరోసారి నీరవ్ దాఖలు చేయనున్నారు. భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) వాదిస్తున్నది. నీరవ్ మోడీ తరఫున క్లేర్ మాంట్గోమరి ఆఫ్ మాట్రిక్స్ చాంబర్స్ వాదిస్తున్నారు.
రాజీవ్ కొచ్చర్పై ఈడీ ప్రశ్నల వర్షం
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్ బావ రాజీవ్ కొచ్చర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కా ర్యాలయంలో రాజీవ్ను వరుసగా మూడోరోజైన బుధవారం విచారించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 11న ఆయన తమ్ముడైన దీపక్ కొచ్చర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఈడీ సూచించిన విషయం తెలిసిందే.
దీపక్, చందాకొచ్చర్లకు ఈడీ మరోసారి సమన్లు
ఏప్రిల్ 30న దీపక్, చందా కొచ్చర్లకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ అధిపతిగా చందా కొచ్చర్గా ఉన్నప్పుడు సింగపూర్కు చెందిన అవిస్తా అడ్వైజరీ పార్టనర్స్, అవిస్టా హోల్డింగ్స్లు తీసుకున్న రుణాలపై రాజీవ్ నుంచి మరింత సమాచారం సేకరించింది. దీనిపై స్పందించడానికి రాజీవ్ కొచ్చర్ నిరాకరించారు.
గూగుల్ బోర్డు నుంచి ష్మిట్ నిష్క్రమణ
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ సంస్థ గూగుల్ను దిగ్గజంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ తాజాగా ఆ సంస్థ బోర్డు నుంచి నిష్క్రమించనున్నారు. జూన్లో ఆయన తప్పుకోనున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తెలిపింది. గతేడాది తొలినాళ్లలోనే ఆల్ఫాబెట్ చైర్మన్ పదవి నుంచి ష్మిట్ తప్పుకున్నారు. ఆతర్వాత నుంచి బోర్డులో సభ్యుడిగా ఉన్నా .. సాంకేతిక సలహాదారు పాత్రకే పరిమితమయ్యారు. జూన్తో ఆయన పదవీకాలం ముగియనుంది.
ఇక సలహాలకే ప్మిట్ పరిమితం
అటుపైన రీ–ఎలక్షన్ కోరరాదని ష్మిట్ నిర్ణయించుకున్నారని, సాంకేతికాంశాల్లో తగు సలహాలు ఇవ్వడం కొనసాగిస్తారని ఆల్ఫాబెట్ పేర్కొంది. ప్రముఖ వ్యాపారవేత్త, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ష్మిట్ను సీఈవోగా 2001లో గూగుల్ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ రిక్రూట్ చేశారు. అప్పటికి గూగుల్ ప్రారంభమై మూడేళ్లే అయింది. ఆ తర్వాత నుంచి సంస్థను భారీగా విస్తరించటంలో పేజ్, బ్రిన్లతో పాటు ష్మిట్ కీలక పాత్ర పోషించారు.
2001 నుంచి 10 పదేళ్లు గూగుల్ సీఈఓగా ఎరిక్ ప్మిట్
2001 నుంచి 2011 దాకా గూగుల్ సీఈవోగా వ్యవహరించారు. తర్వాత ష్మిట్ స్థానంలో పేజ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అటుపై గూగుల్కు ఆల్ఫాబెట్ పేరుతో కొత్తగా మాతృ సంస్థను ఏర్పాటైంది. ఆల్ఫాబెట్ సీఈవోగా పేజ్, గూగుల్ సీఈవోగా ప్రవాస భారతీయులు సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.