మహీంద్రా కంపెనీ నుంచి వస్తున్న XUV3XO ఇండియాలో మొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ కానుంది. మారుతి సుజుకి, హ్యుండై, కియా కంపెనీలు కొత్త హైబ్రిడ్ కార్లు తీసుకొస్తున్నాయి. వీటికి పోటీగా XUV3XO మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామా?

భారత మార్కెట్‌లో హైబ్రిడ్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త హైబ్రిడ్ మోడళ్లను ప్రకటిస్తున్నాయి. మారుతి సుజుకి, హ్యుండై, కియా వంటి కంపెనీలతో పాటు మహీంద్రా కూడా ఈ పోటీలోకి దిగింది. మహీంద్రా తాజా హైబ్రిడ్ మోడల్‌గా XUV3XO స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో XUV3XO

ఈ SUVకి ‘S226’ అనే కోడ్ నేమ్ ఉంది. ఇందులో 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను వినియోగించనున్నారు. ఈ వాహనం టాప్ వేరియంట్‌లకు మాత్రమే స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో లభ్యం కానుంది. వెహికల్ బాడీ డిజైన్, ఇంటీరియర్ గత మోడల్ మాదిరిగానే ఉండనున్నాయి. అయితే హైబ్రిడ్ వెర్షన్‌ను గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘హైబ్రిడ్’ బ్యాడ్జ్‌ను ఏర్పాటు చేస్తారు.

XUV3XO హైబ్రిడ్ మోడల్ ధర

XUV3XO హైబ్రిడ్ మోడల్ ధర ప్రస్తుత వేరియంట్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌తో పాటు రాబోయే మారుతి బ్రెజ్జా హైబ్రిడ్‌తో పోటీ పడనుంది. మారుతి కూడా తమ బలెనో, బ్రెజ్జా మోడళ్లలో స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని సమాచారం.

ఏడాదికి 40,000 వాహనాలు అమ్మాలని లక్ష్యం

మహీంద్రా ఇంగ్లో ఆర్కిటెక్చర్ కోసం రేంజ్ ఎక్స్‌టెండర్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ టెక్నాలజీలో పెట్రోల్ ఇంజిన్ బ్యాటరీకి పవర్ ఇచ్చే జనరేటర్‌గా పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్‌ను పెంచుతుంది. ఈ తరహా హైబ్రిడ్ సిస్టమ్‌తో వచ్చే వాహనాలు ఏడాదికి 40,000 నుండి 50,000 యూనిట్లు అమ్ముడవుతాయని మహీంద్రా అంచనా వేస్తోంది.

ఈ క్రమంలో 2026లో మహీంద్రా XUV3XO స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ మార్కెట్‌లోకి రావడం ద్వారా హైబ్రిడ్ వాహన రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.