ఐడిబిఐ బ్యాంక్ అమ్మకానికి ప్రభుత్వం ఆమోదం.. త్వరలోనే కొత్త ప్రైవేట్ బ్యాంక్ ఏర్పడుతుంద..?
ఐడిబిఐ బ్యాంక్ వాటాను ఎంపిక చేసిన పెట్టుబడిదారుడికి విక్రయించి, బ్యాంకు నిర్వహణను అప్పగించే ప్రతిపాదనకు కేబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఐడిబిఐ బ్యాంకు మొత్తం వాటాలో 94 శాతం కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసి కలిసి ఉన్నాయి.
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ 2021లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఐడిబిఐ బ్యాంక్ వాటాను ఎంపిక చేసిన పెట్టుబడిదారుడికి విక్రయించి, బ్యాంకు నిర్వహణను అప్పగించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐడిబిఐ బ్యాంకు మొత్తం వాటాలో 94 శాతం కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసికి ఉన్నాయి.
అయితే ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ ఉదయం 11.47 వద్ద బలంగా పెరిగింది. దీంతో 2.60 పాయింట్లు (6.85 శాతం) ఎగిసి 40.55 స్థాయిలో ట్రేడవుతోంది. కాగా అంతకుముందు ట్రేడింగ్ రోజున ఇది 37.99 స్థాయిలో ముగిసింది. ప్రస్తుతం 15 శాతం పెరిగి 43.50కి చేరుకుంది. ఐడిబిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .435.69 బిలియన్లు.
ఐదేళ్ల తర్వాత లాభాల్లోకి
గత ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఐడిబిఐ బ్యాంక్ లాభాల్లోకి వచ్చింది. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.1,359 కోట్ల లాభం పొందింది. కాగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ .12,887 కోట్ల నష్టాన్ని కలిగి ఉంది.
ఎల్ఐసి వాటా
ఎల్ఐసికి ఐడిబిఐ బ్యాంకులో 49.21 శాతం షేర్లను కలిగి ఉంది. అలాగే దీని ప్రమోటర్ బ్యాంక్ నిర్వహణపై నియంత్రణ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఐడిబిఐ బ్యాంక్ వ్యూహాత్మక విక్రయానికి ఆమోదం తెలిపినట్లు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తో సంప్రదించి ఈ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసి ఎంత వాటాను విక్రయించాలో నిర్ణయించనున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ లక్ష్యం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ను సమర్పిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్బి) కూడా ప్రైవేటీకరించబడతాయని ప్రకటించడం గమనార్హం. పెట్టుబడుల ఉపసంహరణ నుండి రూ .1.75 లక్షల కోట్లు సేకరించాలని బడ్జెట్ లో లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వ నిర్ణయంపై ఏఐబిఈఏ వ్యతిరేకత
అల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐబిఈఏ ) ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించింది. బ్యాంకు మూలధన వాటాలో 51% ప్రభుత్వం నిలుపుకోవాలని యూనియన్ తెలిపింది. కొన్ని కార్పొరేట్ సంస్థలు రుణాలని తిరిగి చెల్లించకుండా మోసం చేసినందున బ్యాంక్ ఇబ్బందుల్లో పడిందని బ్యాంక్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్బుని తిరిగి పొందేందుకు రుణాలు చెల్లించాలని రుణగ్రహీతలపై చర్యలు తీసుకోవడం అవసరం అని తెలిపారు.