ఫిక్స్డ్ డిపాజిట్లకు నో యూజ్..సేవింగ్స్ ఎకౌంట్..కారణం..
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి నిరాశే మిగులుతున్నది. ఒక్కోసారి సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ కంటే తక్కువగా ఉండటమే దీనికి కారణం.
కోల్కతా: వడ్డీ ఆశించి బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు పెట్టేవారికి నిరాశే కలుగుతోంది. ఎందుకంటే, ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రోజు రోజుకీ తగ్గిపోతోంది. కొన్ని సందర్భాలలో ఏకంగా సేవింగ్స్(ఎస్బీ) ఎకౌంట్పై ఇస్తున్న వడ్డీకి సమానంగా ఉంటోంది.
బ్యాంకుల చేతిలో డబ్బు ఎక్కువగా ఉండటం, అప్పులు తీసుకునే వాళ్లు తక్కువగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయని పేర్కొంటున్నారు.
దీంతో గత్యంతరం లేక రిస్క్తో కూడుకున్న డెట్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో ఈక్విటీ పెట్టుబడులు వంటి వాటి వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఏడు రోజుల ఎఫ్డీలపై వివిధ బ్యాంకులు చెల్లించే వడ్డీ ఎస్బీ ఎకౌంట్పై ఇస్తున్న వడ్డీ కంటే కొద్దిగానే ఎక్కువంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
అప్పులపై వసూలు చేసే వడ్డీ రేట్లకు అనుగుణంగా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను బ్యాంకులు సాధారణంగా సవరిస్తుంటాయి. మార్జిన్లను నిలబెట్టుకునేందుకే బ్యాంకులు ఇలా చేస్తాయి. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఇలాగే పడిపోవడం కొనసాగితే ఇన్వెస్టర్లలో సందేహాలు కలిగే అవకాశం ఉంటుందని డీబీఎస్ బ్యాంక్ ఎకానమిస్ట్ రాధికా రావు చెప్పారు.
also read చైనా గూడ్స్ నిషేధం చేద్దాం.. దేశవ్యాప్త ప్రచారానికి ‘కెయిట్’ పిలుపు
మార్చి 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల పురోగతి 8 శాతానికి పడిపోయింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2018–19) లో డిపాజిట్ల ప్రగతి 9 శాతంగా ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020–21 లోని మొదటి రెండు నెలల్లో చూస్తే డిపాజిట్ల గ్రోత్ రేటు 1.9 శాతానికి పరిమితమైంది.
డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిపోతుండటంతో, ఇన్వెస్టర్లు ఇప్పుడు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారని బార్క్లేస్ బ్యాంక్ ప్రైవేట్ క్లయింట్స్ హెడ్ సందీప్ దాస్ తెలిపారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు పడిపోవడం దేశంలోని పొదుపుపై పడుతోంది.
మన పొదుపు రేటు ఇప్పటికే 15 ఏళ్ల కనిష్టానికి చేరింది. 2018–19 ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే ఇండియా సేవింగ్స్ జీడీపీలో 30.1 శాతానికి తగ్గిపోయాయి. అంతకు ముందు 2011–12 లో ఇవి 34.6 శాతం, 2007–08 లో 36 శాతంగా ఉండేవి.
ఇక హౌస్హోల్డ్ సేవింగ్స్ (గృహ పొదుపు) 2012 నాటి 23 శాతం నుంచి 2018–19 నాటికి 18 శాతానికి పడిపోయాయి. ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితి వల్లే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయని, బ్యాంకులు అప్పులు ఇవ్వకుండా వాటి లిక్విడిటీ పెంచడం వల్ల స్టాట్యుటరీ లిక్విడిటీ హోల్డింగ్స్ పెరుగుతాయని ఐఐఎం కోల్కతా ఎకనమిక్స్ ప్రొఫెసర్ పార్థా రే చెప్పారు.