న్యూఢిల్లీ: గతేడాది టెలికం రంగంలో అడుగు పెట్టిన రిలయన్స్ జియో విసిరిన సవాల్కు దిగ్గజ సంస్థలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్లకు దిమ్మ తిరిగిపోయింది. తాజాగా రిలయన్స్ జియో గిగా ఫైబర్ పేరుతో టీవీ నెట్వర్క్ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: గతేడాది టెలికం రంగంలో అడుగు పెట్టిన రిలయన్స్ జియో విసిరిన సవాల్కు దిగ్గజ సంస్థలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్లకు దిమ్మ తిరిగిపోయింది. తాజాగా రిలయన్స్ జియో గిగా ఫైబర్ పేరుతో టీవీ నెట్వర్క్ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించింది. అలాగే ‘ఈ - కామర్స్’ రంగంలోనూ సేవలందించడానికి ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రిలయన్స్ నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఈ - కామర్స్ సెక్టార్లో సంచలనాలతో దూసుకెళ్తున్న అమెజాన్ గుర్తించింది. మరోవైపు రిలయన్స్ ప్రభావంతో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు అతలాకుతలం అయ్యాయి. అందుకే అమెజాన్ సంస్థతో వొడాఫోన్ - ఐడియా జట్టు కట్టాయి.
జియోకు ప్రతి సవాల్ విసిరేందుకు ఎయిర్టెల్ - వొడాఫోన్ ఇలా
తాజాగా ఉమ్మడిగా రిలయన్స్ జియో విసిరిన సవాల్కు గట్టిగా సమాధానమిచ్చేందుకు అమెజాన్తో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ జట్టు కట్టాయి. ఇప్పటికే అమెజాన్ తన వినియోగదారులకు ప్రైమ్ సభ్యత్వం కల్పిస్తోంది. ఆ క్రమంలో ఎయిర్టెల్, వొడాఫోన్ సబ్ స్క్రైబర్లకు అమెజాన్ రాయితీ కల్పిస్తోంది. ఎయిర్టెల్ కస్టమరయితే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఏడాదిపాటు ఉచితం. వొడాఫోన్ కస్టమర్కు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తొలి ఏడాది ఫీజులో సగం రాయితీ. ఇవన్నీ తమ కస్టమర్లకు టెలికం కంపెనీలు అందిస్తున్న రాయితీలు!!. టెలికం, ఈ – కామర్స్ కంపెనీల మధ్య వ్యాపార బంధానికి ఉదాహరణలు కూడా.
అమెజాన్తో బంధంపై ఎయిర్టెల్ ఆశాభావం ఇలా
ఈ - కామర్స్, డీటీహెచ్, బ్రాడ్బ్యాండ్ సేవలతో మార్కెట్ను షేక్ చేసేందుకు జియో వస్తుండడంతో, పోటీలో నిలబడేందుకు ప్రత్యర్థి సంస్థలు ఇప్పటి నుంచే ఏకం అవుతున్నాయి. రిలయన్స్ జియోతో పోటీ పడేందుకు ఈ కామర్స్ సంస్థలు, హ్యాండ్సెట్ తయారీ సంస్థలతో కలిసి మరిన్ని ఆఫర్లు తెస్తామని ఓ టెలికం కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు కూడా. ఈ కామర్స్ సంస్థలతో దోస్తీ విషయంలో ఎయిర్టెల్ ఎంతో ఆశాభావంతో ఉంది. కొత్త వేదికలను కూడా అన్వేషిస్తున్నట్టు కంపెనీ ఉద్యోగి ఒకరు చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ నెల ఆరంభంలో సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో మాట్లాడుతూ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ రిటైల్ చైన్ కలిసి ఆన్లైన్– ఆఫ్లైన్ రిటైల్ వెంచర్గా మారనున్నట్లు ప్రకటించడం తెలిసిందే.
డీటీహెచ్ ప్లస్ ఈ కామర్స్ అండ్ డిజిటల్ అనుబంధంతో ఇలా
ఈ కామర్స్, డీటీహెచ్, డిజిటల్ సేవలు, టెలికం సేవల విషయంలో రిలయన్స్ ప్రతిష్టాత్మక ప్రణాళికల నేపథ్యంలో ఇతర టెలికం కంపెనీలు, ఈ కామర్స్ కంపెనీలు ఒక్కటై నడవాల్సిన పరిస్థితులు తప్పనిసరవుతున్నాయనేది నిపుణులు విశ్లేషించారు ‘టెలికం కంపెనీలకు చివరిదాకా కస్టమర్లతో సంబంధం ఉంటుంది. కానీ, దాన్ని లాభదాయకంగా మార్చుకోవాలి. పారదర్శక వాటా కోసం అవి మరింత మెరుగైన సేవలందించే స్థితిలో ఉండాలి’’ అని డెలాయిట్ ఇండియా మీడియా, టెక్నాలజీ పార్ట్నర్ హేమంత్ ఎం జోషి చెప్పారు. టెలికం సంస్థలు నిరంతరం మెరుగైన సేవలందించాలని భావిస్తాయని హేమంత్ ఎం జోషి చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ కామర్స్, ఇతర కంపెనీలతో టారిఫ్లు, పరికరాలు, కంటెంట్ విషయంలో మరిన్ని భాగస్వామ్యాలు అవసరం ఉందన్నారు.
జియో పోటీకి భయపడి కాదన్న అమెజాన్
అయితే, మొబైల్ ఆపరేటర్లతో సంయుక్తంగా అందించే ఆఫర్లు జియో ఈ కామర్స్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవి కాదని అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అక్షయ్సాహి చెప్పారు. ఈ భాగస్వామ్య చర్యలను గతేడాది జూలై నుంచే ప్రారంభించినట్టు సాహి పేర్కొన్నారు. ‘‘టెలికం కంపెనీలతో ఒప్పందాలు కస్టమర్లను చేరుకునేందుకే. దాంతో వారు అమెజాన్ ప్రైమ్ సేవలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోగలరు’’ అని సాహి చెప్పారు.
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్తో ఇలా లాభాలు
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వారు ప్రైమ్ యాప్ ద్వారా తెలుగుతో పాటు ఎన్నో భాషల సినిమాలు, ఇతర వీడియో కంటెంట్ ఉచితంగా చూడొచ్చు. ఉచితంగా పాటలను ‘ప్రైమ్ మ్యూజిక్’ ద్వారా వినొచ్చు. పైపెచ్చు వీరికి అమెజాన్లో కొనుగోళ్లపై ఉచిత డెలివరీ, ఫాస్ట్ డెలివరీ ప్రయోజనాలూ ఉన్నాయి. ‘అమెజాన్ ప్రైమ్ అన్నది భారత్లో ఇంకా ఆరంభంలోనే ఉంది. దీని గురించి చాలా మందికి తెలియదు. టెలికం కంపెనీలతో టైఅప్ అవడం వెనుక ఉద్దేశం మరింత మందిని చేరటమే’ అని అక్షయ్ వివరించారు.
మాకు అటువంటి ఆలోచనే లేదన్న ఫ్లిప్కార్ట్
టెలికం సంస్థలతో తమకు ఈ తరహా భాగస్వామ్యాల్లేవని, ఇందుకు సంబంధించి చర్యలు కూడా లేవని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ‘కస్టమర్ల పరంగా ఓవర్ల్యాప్కు (రెండు సంస్థలకూ ఒకే కస్టమర్) ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అధిక ఆదాయ పోస్ట్పెయిడ్ కస్టమర్లతో అమెజాన్ టైఅప్ అవడం తెలివైన యోచన అవుతుంది’’ అని కన్సల్టింగ్ సంస్థ ఏటీ కెర్నే పార్ట్నర్ అభిషేక్ మల్హోత్రా పేర్కొన్నారు.
ఎయిర్టెల్, వొడాఫోన్ సబ్స్కైబర్లకు అమెజాన్ ఆఫర్లు ఇవీ
ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ కస్టమర్లు రూ.499 అంతకంటే అధిక విలువ కలిగిన ప్లాన్లలో ఉంటే అమెజాన్ ఏడాది కాల ప్రైమ్ సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది. వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కస్టమర్లు ఏడాది కాల ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్కు అర్హులు. 18–24 ఏళ్ల మధ్యనున్న యువ ప్రీపెయిడ్ కస్టమర్లయితే రూ.999కు బదులు కేవలం రూ.499 చెల్లించి అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని పొందొచ్చు. దీనిపై స్పందించేందుకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ స్పందించడానికి నిరాకరించాయి.
