మేఘాలయలో భర్త హత్య కేసులో సోనమ్‌ కీలక నిందితురాలిగా బయటపడింది. ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి రాజాను చంపిందని పోలీసులు చెబుతున్నారు.

మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్‌ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. హత్యకు కుట్ర పన్నింది భార్యేనని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ కేసులో సోనమ్ రఘువంశీని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు. ఆమెను మేఘాలయకు తరలించారు. అనంతరం పోలీసులు ఆమెను పాట్నాకు తరలించి అక్కడి స్టేషన్లో ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం 12.55 గంటలకు పాట్నా నుంచి గౌహతికి విమానంలో తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గౌహతి నుంచి మేఘాలయకు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ వ్యవహారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా అయ్యిందిహనీమూన్ కోసం మధ్యప్రదేశ్ నుంచి భర్త రాజా రఘువంశీతో కలిసి కలిసి సోనమ్ మేఘాలయకు వెళ్లింది. అక్కడే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు పక్కా ప్రణాళికలు రచించి.. మరో ఇద్దరితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత సోనమ్ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రాజా రఘువంశీ డెడ్‌ బాడీ దొరికింది. టూరిస్ట్ గైడ్, హోటల్ సీసీటీవీ ఫుటేజి, ఫోన్ కాల్ డాటా ఆధారంగా మేఘాలయ, మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని, తననే ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె అంటోంది.

పెళ్లైన ఐదో రోజు నుంచే ప్రణాళికలు..

ఇండోర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీ–సోనమ్ పెళ్లి మే 11న జరిగింది. పెళ్లయిన ఐదు రోజే అంటే మే 16న సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుశ్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. ‘రాజాను చంపేద్దాం.. కిడ్నాప్ నాటకం చేద్దాం. అప్పటికి నేను విదవగా మారుతాను. నాన్న కూడా మన పెళ్లికి అంగీకరిస్తారు’ అని సోనమ్ తన ప్రియుడు రాజ్‌తో చెప్పిందట. భర్తను హత్య చేసిన కత్తిని ఆన్‌లైన్ ద్వారా తెప్పించారు. సంఘటనకు ముందు నిందితులు సోనమ్ హోం స్టేకు 1 కి.మీ దూరంలోని హోటల్లో బస చేశారు. వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే.

మే 23న ఫోటోషూట్ నెపంతో సోనమ్, రాజాను ఒంటరిగా ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లింది. సమయం చూసి చంపేయండి అని అరవడంతో.. అక్కడే ఉన్న ముగ్గురు యువకులు రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా చంపేశారు. తర్వాత నిందితుడు విశాల్ చౌహాన్ రాజా తలపై కత్తితో గాయపరిచాడు. మరో నిందితుడు ఆకాశ్ రాజ్‌పుత్ దూరం నుంచి బైక్ మీద ఉండి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. మొదట నిందితులు ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు. కానీ సోనమ్ రూ.20 లక్షలు ఇస్తానని ఆశ చూపించడంతో చంపేశారు. మే 23న హత్య చేసిన అనంతరం అదే రోజు శిలాంగ్ నుంచి గువాహటికి వెళ్లిన సోనమ్, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వారణాసి మీదుగా గాజీపూర్‌కు చేరుకుంది.

దారి మధ్యలో తన మొబైల్ ఫోన్‌లను కూడా ధ్వంసం చేసింది. అయితే పోలీసుల విచారణలో సోనమ్ సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. అందులో ఆమె నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నట్లు తేలింది. తర్వాత CDR, కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ కుశ్వాహా అక్కడ ఉన్నట్లు తెలిసింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోనమ్ తన ‘గేమ్’ ముగిసిందని అర్థం చేసుకుని, ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఢాబాలోకి వెళ్లి లొంగిపోయింది.

హత్యకు కుట్ర పన్నిన రాజ్ కుశ్వాహానే, రాజా అంత్యక్రియలో స్వయంగా పాల్గొని తతంగం జరిపించాడు. మృతుడి మామ దవీ సింగ్‌ ను ఓదారుస్తూ ఉండటం వీడియోల్లో కనిపించింది. ఇందులో అతడు తీవ్ర భావోద్వేగంలో ఉన్నట్లు కనిపించింది.