విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా జేడీ : ముద్రగడకు పవన్ కళ్యాణ్ గాలం
విశాఖపట్నం నియోజకవర్గం నుంచి మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను దించాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు జేడీ పోటీపై పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చేశారని సాయంత్రం లోపు జేడీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
విజయవాడ: ఏపీలో నామినేషన్ల ప్రక్రియ వేగవంతం కావడంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటికే పొత్తులో భాగంగా సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలకు టికెట్లు కేటాయించిన పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చెయ్యబోయే పార్లమెంట్ అభ్యర్థులపై దృష్టి సారించారు.
ఏపీలో ఇప్పటి వరకు 8 స్థానాల్లో జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే పొత్తులో భాగంగా సీపీఐ పార్టీకి రెండు, సీపీఎంకు రెండు, బీఎస్పీకి 3 పార్లమెంట్ సీట్లను కేటాయించారు.
అంటే మెుత్తం జనసేన పార్టీ మిత్ర పక్షాలతో కలుపుకుని 15 మంది పార్లమెంట్ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అయితే మిగిలిన 10 పార్లమెంట్ నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు.
అందులో భాగంగా విశాఖపట్నం నియోజకవర్గం నుంచి మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను దించాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు జేడీ పోటీపై పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చేశారని సాయంత్రం లోపు జేడీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇకపోతే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాలం వేస్తున్నారని తెలుస్తోంది. ముద్రగడను కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన తరపున కొందరు నేతలు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం నిర్ణయంపై జనసేన పార్టీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.