Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు తరఫున భువనేశ్వరి: కుప్పం నేతలతో మాటామంతీ

సారు చాలా బిజీగా ఉన్నారు, మీకు నేనున్నా, మీ అవసరాలు చెప్తే తీర్చడానికి ప్రయత్నిస్తా అని భువనేశ్వరి కుప్పం నియోజకవర్గం టీడీపి నేతలకు చెప్పారు. కుప్పం సమన్వయ కమిటీ సభ్యులతో ఆమె గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడారు. దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడారు. 

Nara Bhuvaneswari speaks with Kuppam TDP leaders
Author
Kuppam, First Published Mar 30, 2019, 1:20 PM IST

చిత్తూరు: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సాగిస్తూ తీరిక లేకుండా ఉన్న తన భర్త నారా చంద్రబాబు నాయుడికి నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో ఆమె మాట్లాడారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆమె అమరావతి నుంచి వారితో మాట్లాడారు. 

సారు చాలా బిజీగా ఉన్నారు, మీకు నేనున్నా, మీ అవసరాలు చెప్తే తీర్చడానికి ప్రయత్నిస్తా అని భువనేశ్వరి కుప్పం నియోజకవర్గం టీడీపి నేతలకు చెప్పారు. కుప్పం సమన్వయ కమిటీ సభ్యులతో ఆమె గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడారు. దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడారు. 

చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నందువల్లనే తాను మాట్లాడుతున్నట్లు ఆమె వారితో చెప్పారు. విభేదాలు పక్కన పెట్టి చంద్రబాబుకు అత్యధిక మెజారిటీ లభించేలా పనిచేయాలని ఆమె వారికి సూచించారు. ఇంతలో లైన్ లోకి వచ్చిన కుప్పం నియోజకవర్గం ఇంచార్జీ మునిరత్నం - పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్తున్నామని చెప్పారు. 

మీరు కుప్పాన్ని పట్టించుకోవడం లేదు, అక్కడి పార్టీ నాయకులూ కార్యకర్తలూ నిరాశపడుతారేమోనని తాను సారుతో అన్నానని, అయితే కుప్పం గురించి భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెప్పారని ఆమె అన్నారు. తాను ఉన్నా, లేకపోయినా పార్టీ తమ్ముళ్లు బాగా పనిచేస్తారని చంద్రబాబు చెప్పినట్లు కూడా ఆమె తెలిపారు. 

తనకు కుప్పంతో అంతగా సంబంధాలు లేకపోవడం, తాను అక్కడికి తరుచుగా రాకపోవడం బాధగానే ఉందని, ఈసారి ఏమైనా సందర్భాలు ఉంటే పిలిస్తే వస్తానని ఆమె తెలుగుదేశం పార్టీ నేతలతో చెప్పారు. తాను రాజకీయంగా అంతగా చురుగ్గా ఉండనని భువనేశ్వరి చెప్పారు. సారు బిజీ కాబట్టి మీ సమస్యలు నేను పట్టించుకుంటానని ఆమె వారికి హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios