పెళ్లి కావడంలేదని మనస్థాపంతో యువతి ఆత్మహత్య
రైలు కిందపడి ఆత్మహత్య...ప్రకాశం జిల్లా మార్కాపురం లో దుర్ఘటన
పెళ్లి కావడం లేదన్న మనసప్థాపంతో ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన ప్రకాశం జిల్లా లో చోటుచేసుకుంది. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరక పోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ రాసిపెట్టి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మార్కాపురం పరిధిలో చోటుచేసుకుంది.
ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. శివ పార్వతి అనే యువతి తల్లి చనిపోయి, తండ్రి పట్టించుకోకపోవడంతో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటోంది. ఈమెతో పాటు చెల్లి కూడా అక్కడే ఉంటోంది. ఇటీవలే డిగ్రీ పాసైన పార్వతి నంద్యాలలో బ్యాంకు కోచింగ్ తీసుకుంటుంది.
అయితే పార్వతికి పెళ్లి చేయాలని అమ్మమ్మ, బంధువులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వచ్చిన సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో ఈమె తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. దీంతో గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉంటోంది. ఇలా బాధపడుతూ జీవించడం ఇష్టం లేక తనువు చాలించాలని నిర్ణయించుకుంది.
నంద్యాలకు వెలుతున్నానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరిన శివ పార్వతి నేరుగా మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకుంది. అక్కడ ఓ ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఉన్న ఆధార్ కార్డు,సూసైడ్ లెటర్ ను పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.