ఐఏఎస్ లకు విజయసాయి షాక్
- రాష్ట్రంలో కీలక స్ధానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులతో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢీ కొట్టటానికి సిద్దంగా ఉన్నారు.
రాష్ట్రంలో కీలక స్ధానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులతో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢీ కొట్టటానికి సిద్దంగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం విజయసాయి మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులను బ్రోకర్లుగా వర్ణించటం అందరకీ తెలిసిందే. దానిపై ఐఏఎస్ అధికారుల సంఘం ఘాటుగా స్పందించింది. తమపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే సమస్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా మంత్రులు కూడా స్పందించారు. విజయసాయిరెడ్డిపై చర్చలు తీసుకుంటామంటూ తీవ్రంగా హెచ్చరించారు.
మంత్రులు, ఐఏఎస్ అధికారుల హెచ్చరికలను గురువారం విజయసాయి తిప్పికొట్టారు. ఐఏఎస్ అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ వారికి షాక్ ఇచ్చారు. వైసిపి ఎంఎల్ఏల కొనుగోలు వెనుక ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్, ఇంటెలిజెన్స్ ఐజి వెంకటేశ్వర్రావులున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఎంఎల్ఏల కొనుగోళ్ళు వెనుక ఐఏఎస్ అధికారులున్న విషయాన్ని ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు వద్ద పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు తమ బాధ్యతలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు మండిపడ్డారు. తగిన సమయంలో తమ వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానంటూ విజయసాయి సవాల్ విసిరారు.