నాయుడు క్యాబినెట్ లో నిజాయితీ ఉన్న ‘ఒకే ఒక్కడు’
జిల్లా పరిషత్ సమావేశంలో ప్రతిపక్ష వైసిసి ఎమ్మెల్యేలంతా తెలుగు దేశం క్యాబినెట్ లో ఉన్న ఏకైక నిజాయితీ పరుడు సుజయకృష్ణ రంగారావేనని కొనియాడారు.
సాధారణంగా చాన్స్ దొరికినపుడల్లా ప్రతిపక్ష పార్టీ లెపుడూ రూలింగ్ పార్టీ మీద ఒక రాయి వేయాలనే చూస్తుంటాయి.
ముఖ్యంగాఅవినీతి విషయంలో రూలింగ్ పార్టీని, ముఖ్యమంత్రిని, మంత్రులను ఉతికి ఆరేస్తుంటారు. అయితే, ఇలా కాకుండా, ప్రతిపక్షం చేత నిజాయితీలో ‘ ఒకే ఒక్కడు ’ అనిపించుకున్న ఘనత కొత్తగా గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుజయ కృష్ణ రంగారావుకు దక్కింది.
నిన్న జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో ప్రతిపక్ష వైసిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఆయన గుణ గణాలను ఆకాశానికెత్తేశారు. రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న ఏకైక నిజాయితీ పరుడని కొనియాడారు. ఇలాంటిది ఎక్కడయినా జరుగుతుందా?
డాక్టర్ స్వాతిరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైసిసి శాసన సభ్యులు ముక్త కంఠంతో రాష్ట్ర క్యాబినెట్ నీతి నిజాయితీ గత ఒకే ఒక్కడు సుజయ కృష్ణారావు అని పొగిడేశారు. ఆయన మీద అపారమయిన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కోలగట్లవీరభద్ర స్వామి సుజయ్ కు అభినందనలు తెలుపుడూ ‘ఇక జిల్లాలో అవినీతి పాలన సాగదు. ప్రజలకు మంచిరోజులొచ్చాయి,’ అని ప్రకటించేశారు. తమాషా ఏమిటంటే, ఈ సమావేశానికి గైర్ హాజరయింది తెలుగుదేశం సభ్యులే. టిడిపి ఎమ్మెల్యేలు మీసాల గీత, డాక్టర్ కె ఎ నాయుడు, కోళ్ల లలితకుమారిలతో పాటు ఎమ్మెల్సీలు ద్వారపు జగదీశ్ రెడ్డి, గాదె శ్రీనివాసులునాయుడు, గుమ్మడి సంధ్యారాణి ... అంతా సమావేశానికి డుమ్మా కొట్టారు.
సుజయ కృష్ణ రంగారావు గత యేడాది వైసిపి నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీకి ద్రోహం చేసినందుకు ఆయన మీద వారికి బాగా కోపం ఉండాలి. పార్టీ ఫిరాయించి మంత్రి అయినందుకు ఆయన్ను సమావేశంలో ఏకిపడేయాలి. అలా చేయలేదు. సరిగదా చంద్రబాబు క్యాబినెట్ లో నిజాయితీ ఉన్న ఒకే ఒక్కడని చప్పట్లు కొట్టారు.
ఇంత నిజాయితీ పరుడు పార్టీ మారడమేమిటో, మారినా, రాజీనామా చేసి ధీమాగా గెల్చి మంత్రి అయివుండవచ్చుగదా...
ఇపుడు అసలు విజయనగరం జిల్లా వైసిపి నేతల దృష్టిలో నిజాయితీ అర్థమేమిటో.... అర్థం కావడంలే..