రాద్దాంతం ఎందుకు.. ఎస్ఈసి, చంద్రబాబు, పవన్ కోర్టుకు వెళ్లొచ్చుకదా..: అంబటి
అధికారం కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై దుర్మార్గంగా మాట్లడుతున్నారని వైసిపి ఎమ్మెల్యే అంబటి అన్నారు.
సత్తెనపల్లి: ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను తప్పుబడుతున్న టిడిపి చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. అధికారం కోసం అర్రులు చాస్తున్న ఈ ఇద్దరు ఏకగ్రీవాలపై దుర్మార్గంగా మాట్లడుతున్నారని అన్నారు. ఏకగ్రీవాలు అనార్ధమని చెప్పటం బాధకరమని... పరస్పర అంగీకారంతో ఏకగ్రీవం అయితే తప్పు ఎలా అవుతుందని అంబటి అన్నారు.
''ఏకగ్రీవాలు తప్పు అయితే గత ప్రభుత్వాలు ఎలా పారితోషికం ఇచ్చాయి. ఏకగ్రీవం అనర్థమంటున్న ఎస్ఈసి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోర్టులకు వెళ్ళొచ్చు కదా. క్లారిటీ లేకుండా చంద్రబాబు, నిన్నగాక మొన్నొచ్చిన పవన్ కళ్యాణ్ చిందులు వేస్తున్నారు. ఏకగ్రీవాలు అందరు సంతోషించాల్సిన అంశం. ప్రజాస్వామ్యంలో ఈ ధోరణి శోచనీయం'' అని అంబటి పేర్కొన్నారు.
read more 2009లో వైఎస్ చనిపోతే.. 2021లో అభిమానమా: నిమ్మగడ్డపై అంబటి వ్యాఖ్యలు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అంబటి ఆరోపించారు. ఎస్ఈసీ రాజ్యాంగ స్పూర్తితో పనిచేయడం లేదన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు ఇంతకు ముందు జరగలేదా అని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదని ఎక్కడ ఉందని ఆయన అడిగారు.
కక్షలు, కార్ఫణ్యాలు లేకుండా ఏకగ్రీవ ఎన్నికలు జరగడాన్ని ఎందుకు తప్పుబడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పంచాయితీ ఎన్నికలకు ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబునాయుడు విడుదల చేశారన్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు.
రాజ్యాంగానికి విరుద్దంగా చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. ఇది నిబంధనలకు విరుద్దమన్నారు. ఈ నిబంధనలకు విరుద్దంగా మేనిఫెస్టోను విడుదల చేసిన బాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.