ఏపీ కొత్త డీజీపీ ఎవరు?: రేసులో గౌతం సవాంగ్ టాప్
కొత్త డీజీపీ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ
అమరావతి: ఏపీ రాష్ట్రానికి కొత్త డీజీపీని ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఈ మేరకు బుధవారం నాడు ముగ్గురు ఐఎఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. డీజీపీ పదవికి అర్హులైన ముగ్గురు అభ్యర్ధుల జాబితాను ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తోంది. డీజీపీని ఎంపిక చేసుకొనే అధికారాన్ని రాష్ట్రానికే కట్టబెట్టేలా చట్టాన్ని సవరిస్తూ గత ఏడాది డిసెంబర్ మాసంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న మాలకొండయ్య ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త డీజీపీని ఎంపిక చేసుకొనే అవకాశం నెలకొంది. దరిమిలా కొత్త డీజీపీ ఎంపిక కోసం సర్కార్ ప్రయత్నాలను ప్రారంభించింది.
కొత్త డీజీపీ రేసులో ప్రధానంగా ఇద్దరి పేర్లు విన్పిస్తున్నాయి. విజయవాడ కమిషనర్గా కొనసాగుతున్న గౌతం సవాంగ్, ఏసీబీ డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాగూర్ పేర్లు ప్రధానంగా పోలీసు వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
కొత్త డీజీపీ ఎంపిక కోసం అర్హులైన ముగ్గురు అధికారుల జాబితాను ఎంపిక చేసేందుకు గాను సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. మన్మోహాన్ సింగ్, శ్రీకాంత్, ఏసీ పునేఠాలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ముగ్గురు అర్హులైన ఐఎఎస్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు.
డీజీపీ రేసులో విజయవాడ సీపీగా పనిచేస్తున్న గౌతం సవాంగ్ పేరు ప్రధానంగా విన్పిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో సుమారు నాలుగేళ్లపాటు గౌతం సవాంగ్ కమిషనర్గా పనిచేశారు. ఆయనకు మంచి ట్రాక్ రికార్డు కూడ ఉంది.
విజయవాడ కమిషనర్గా కాల్ మనీ కేసులో గౌతం సవాంగ్ వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలను పొందింది. మంచిన మంచిగానే చూసే పరిస్థితి ఆయనకు ఉందని పోలీసు వర్గాల్లో ప్రచారంలో ఉంది.