Andhra Pradesh: విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో కారు లాక్ అవ్వడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో రెండు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు మూడు ఘటనల్లో మొత్తం 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం రూరల్ మండలంలోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ద్వారపూడి గ్రామంలో ఆదివారం ఉదయం సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు కారులో చిక్కుకుని ఊపిరాడక మృతిచెందారు.
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం, ఉదయం బయట ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు ఉదయ్ (8), చారుమతి (8), చరిష్మా (6), మనస్వి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. చివరికి గ్రామంలోని మహిళా మండలి కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచిన కారు లోపల నలుగురు చిన్నారుల మృతదేహాలను గుర్తించారు.
అనుమానించదగ్గ విధంగా చిన్నారులు ఆడుకుంటూ ఆ కారులోకి వెళ్లి ఉండొచ్చని, అనంతరం అది లోపల నుంచి లాక్ అవడంతో వారు బయటకి రాలేకపోయారని భావిస్తున్నారు. శ్వాస ఆడకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కుప్పం దేవరాజపురంలో విషాదం: నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దేవరాజపురం గ్రామంలో ఆదివారం ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణానికి తవ్విన గుంతలో వర్షపు నీరు చేరడంతో, ఆ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, శాలిని (5), అశ్విన్ (6), గౌతమి (8) అనే చిన్నారులు ఆడుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నివాస నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచింది. ఆ గుంత ప్రమాదకరంగా ఉండటాన్ని తెలియక, ఆ ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా నీటిలోకి జారి పడి మునిగిపోయారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఏలూరులో జల్లేరు జలాశయం చూడ్డానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
ఏలూరు జిల్లాలోని జల్లేరు జలాశయం చూడ్డానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 10 ఏళ్ల సిద్దిఖ్, 7 ఏళ్ల అబ్దుల్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నారు.