భారతదేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందలాది కేసులు నమోదవగా తెలుగు రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎన్ని కేసులున్నాయో తెలుసా?
Corona Virus : భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఎండలు తగ్గి వర్షాలు మొదలవడం, వాతావరణం చల్లబడటంతో కరోనా కేసులు మెళ్లిగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వెయ్యికిపైగా యాక్టివ్ కేసులుంటే ఇందులో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ మహమ్మారి వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాపిస్తోంది. ఒక్కోటిగా కేసులు బైటపడుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం ఐదు కరోనా యాక్టివ్ కేసులు బైటపడ్డాయి. విశాఖపట్నం, కోనసీమలో మొదట రెండు కేసులు వెలుగుచూసాయి... తాజాగా వివిధ ప్రాంతాల్లో మరో ముగ్గురు కూడా కరోనాతో బాధపడుతున్నట్లు తేలింది. పశ్చిమ గోదావరి, గుంటూరుతో పాటు తెనాలిలో ఒక్కో కేసు బైటపడింది.
తెనాలిలో 74 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ గా తేలింది... దీంతో అతడికి మెరుగైన చికిత్స అందిస్తున్నాయి. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ఒక్కటే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా అతడికి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
తెలంగాణలో కూడా తాజాగా ఓ యాక్టివ్ కరోనా కేసు బైటపడింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన ఓ డాక్టర్ కొద్దిరోజులుగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో అతడు టెస్టులు చేసుకోగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో అతడు క్వారంటైన్ లో ఉంటూ వైద్యసహాయం తీసుకుంటున్నాడు.
ఇదిలావుంటే దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1009 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో దక్షిణాది రాష్ట్రమైన కేరళలోనే అత్యధికంగా 403 కేసులున్నాయి. ఇక మహారాష్ట్రలో 209, దేశ రాజధాని డిల్లీలో 104, గుజరాత్ లో 83, కర్ణాటకలో 47, ఉత్తర ప్రదేశ్ లో 15, పశ్చిమ బెంగాల్ లో 12 కేసులు నమోదయ్యాయి. ఈ కోవిడ్ బారినపడి కేరళలో ఇద్దరు, మహరాష్ట్రలో నలుగురు, కర్ణాటకలో ఒకరు మరణించారు.
ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని... ఈ ఎన్బి.1.8.1, ఎల్ఎఫ్.7 వేరియంట్లు అంత ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికి మన పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం, మరణాలు కూడా సంభవించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ మాస్కులు, శానిటైజర్లు బయటకు తీసి ఉపయోగించడం ప్రారంభిస్తున్నారు.