పాపం, ఆంధ్రా బిజెపి అగచాట్లు చూడండి
ఇంటింటికి తెలుగుదేశమని టిడిపి,వైఎస్ఆర్ కుటుంబం అని జగన్, తెలుగుదేశం వైఫల్యాల మీద కాంగ్రెస్, వామపక్షాలు జనం మధ్య ఉంటున్నాయి. బిజెపికి ఉన్న కార్యక్రమం ఏమిటి?
ఉత్తర భారత దేశంలో లాగా ప్రధాని ప్రధాని మోదీ హవా దక్షిణ భారతంలో వీస్తుందా? కష్టమే...
ఈ అనుమానం ఆంధ్రా బిజోపిలో బలంగా ఉంది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, లేదా ఇతరసీనియర్ నాయయకులు అప్పుడప్పుడు రాష్ట్ర పర్యటన చేసి, పార్టీ పోగు చేసిన కార్యకర్తల సమావేశంలో రెచ్చి పోయి 2019లో అధికారంలోకి వచ్చేలా పని చేయాలని చెప్పిపోతున్నారు. అయితే, ఎలా పని చేయాలో ఇక్కడి బిజెపి వాళ్లకి తెలియడం లేదు. ఎందుకంటే, ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపిలో ప్రజల్లో లేనే లేదు. వైసిపి, కాంగ్రెస్, చివరకు వామపక్షాలు కూడా ఎంతో కొంత జనంలోకి పోతున్నాయి. బిజెపి ఒక్కటే ఏ పనిచేయడం లేదు. అపుడపుడు సోమూ వీర్రాజు,కన్నాలక్ష్మినారాయణ, పురందేశ్వరి, కె ఎస్ రావు వంటివారు ప్రజల గురించి ,టిడిపి పాలన లొసుగుల గురించి మాట్లాడుతూ వచ్చారు. వారి నోరు ఈ మధ్య మూత పడింది. మరి ప్రభుత్వ తీరు విమర్శించకుండా జనంలోకి పోవడమెలా... ప్రభుత్వ తీరు బాగుందంటే జనంలో ఒక పార్టీగా నిలదొక్కుకునేదెలా? ఇది బిజెపిని పీడిస్తున్న ప్రశ్న.మిత్రపక్షమయిన టిడిపితో ముందుకు కదులుతూ, సొంతంగా బలపడటం సాధ్యమా, పార్టీలో సమావేశాలలో ఎదురవుతున్న ప్రశ్న.
పోనీ ప్రధాని మోదీ ప్రకటించిన కేంద్ర పథకాలను తీసుకుని జనంలోకి వెళ్లాలంటే, ఏది కేంద్ర పథకమో ఏది రాష్ట్ర పథకమో కూడా తెలియని అయోమమయంలో బిజెపి ఉంది. అన్ని కేంద్రపథకాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. లేదంటే ఎన్టీరామారావు. ప్రధాని బొమ్మ ఎక్కడా ఉండదు. ప్రధాని మోదీ ప్రజల కోసం ఈ పనిచేశాడని చెబుతాతమంటే ఏ స్కీం మీద ఆయన బొమ్మ ఉండటంలేదు.
మోదీ ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటున్నాయని క్యాడర్ చెబుతున్నా రాష్ట్ర కేంద్ర నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల 2019 లో బిజెపి జాతకం మారేదేమీ ఉండదని, టిడిపి పొత్తుతోనే సంతృప్తి పడాల్సి వస్తుందని అంటున్నారు. ప్రధాని మోదీ గాలి ఆంధ్ర సరిహద్దుల్లో వీచే విషయం మర్చిపోవలసిందేనని వారు లోలోన కుమిలిపోతున్నారు.‘ ఇంటింటికి తెలుగుదేశమని టిడిపి,వైఎస్ఆర్ కుటుంబం అని జగన్, తెలుగుదేశం వైఫల్యాల మీద కాంగ్రెస్, వామపక్షాలు ఏదో రకంగా నిత్యం జనం మధ్య ఉంటున్నాయి. ఆ పార్టీలు సంస్థాగతంగా బిజెపి కన్నా బలంగా ఉన్నాయి. బిజెపికి ఉన్న కార్యక్రమం ఏమిటి?’ అని ఒక సీనియర్ నాయకుడు ఏదురు ప్రశ్నవేశారు.