జగన్ సైలెంట్...చంద్రబాబులో ఆందోళన
- కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్రంలో ఆందోళనలు మొదలైన సంగతి అందరికీ తెలిసిందే.
ఎక్కడికక్కడ జనాలు టిడిపి నేతలను నిలదీస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్రంలో ఆందోళనలు మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. మూడున్నరేళ్ళుగా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. ‘ఓటుకునోటు’ కేసులో ఇరుక్కోవటమే కారణమని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో జనాలు, ప్రతిపక్షాల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా చంద్రబాబు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడనిది అందుకే.
భాజపా, టిడిపిలు కలిసే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని జనాలు మండిపడుతున్నారు. అయితే, బిజెపితో పొత్తు తెంపుకుంటే వ్యక్తిగతంగా తనకు ఇబ్బందులు వస్తాయనే చంద్రబాబు అన్నింటినీ భరిస్తూ వచ్చారు. అయితే, ఈ ఏడాదిలోనే ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇపుడు కూడా భాజపాను వదిలించుకోకపోతే టిడిపికి జరగబోయే నష్టంపై చంద్రబాబులో ఆందోళణ మొదలైంది.
వచ్చే ఎన్నికల్లో బిజెపిని బూచిగా చూపించి లబ్దిపొందాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. అందుకే ఇపుడు కేంద్రానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు. తాను నేరుగా మాట్లాడకుండా ఎంపిలు, మంత్రులు, నేతలతో గట్టిగా మాట్లాడిస్తున్నారు. బడ్జెట్ నేపధ్యంలో తాము జనాల్లోకి వెళ్ళటం కష్టంగా ఉందని పలువురు ఎంపిలు, మంత్రులు, ఎంఎల్ఏలు చంద్రబాబుతో మొత్తుకుంటున్నారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే జనాలకు ఏమని సమాధానం చెప్పాలో నేతలకు అర్ధం కావటం లేదు. విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, తిరుపతి లాంటి చోట్ల జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు పెరుగుతున్న జనాగ్రహంతో టిడిపి నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది.
మరోవైపు టిడిపిలో జరుగుతున్న పరిణామాలను వైసిపి నిశితంగా గమనిస్తోంది. బడ్జెట్ సాకుగా ఇప్పటికిప్పుడు టిడిపి-బిజెపి పొత్తులు విచ్చినమ్మయ్యే అవకాశాలు లేవన్నది వైసిపి అంచనా. బిజెపిపై జనాల్లో మరింత వ్యతిరేకతను పెంచటం ద్వారా టిడిపి లబ్దిపొందేలా చంద్రబాబు వ్యూహం రచిస్తున్నట్లు వైసిసి అనుమానిస్తున్నది.
ఎందుకంటే, ఇప్పటికిప్పుడు పొత్తు విడిపోతే ఎక్కడ బిజెపి-వైసిపిలు ఏకమవుతాయో అన్న ఆందోళన చంద్రబాబులో కనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా బిజెపి గురించి ఆలోచిస్తున్నది తమపై ఉన్న కేసుల్లో నుండి బయటపడేందుకే అన్నది వాస్తవం. ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన జరిగే అత్యవసర సమావేశం తీసుకునే నిర్ణయంపై రాజకీయ సమీకరణలు ఆధారపడి ఉంటాయి.