చంద్రబాబు అరెస్ట్ .. లోక్సభలో ప్రస్తావించిన టీడీపీ, రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయాన్ని ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో మరోసారి ప్రస్తావించారు. నంబి నారాయణన్ను తప్పుడు కేసులతో ఎలా నిర్బంధించారో, తమ అధినేతను కూడా అలాగే అరెస్ట్ చేశారని ఆరోపించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయాన్ని ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో మరోసారి ప్రస్తావించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తూ.. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ను తప్పుడు కేసులతో ఎలా నిర్బంధించారో, తమ అధినేతను కూడా అలాగే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఎందరో యువనేతలకు స్పూర్తినిచ్చిన నాయకుడిపై రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. రూ.43 వేల కోట్ల దేశ సంపదను దోచుకున్న నేత బెయిల్పై వచ్చి పదేళ్లు పూర్తయినందుకు కొందరు సంబరాలు చేసుకున్నారంటూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిపై రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు చేశారు. దీనికి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ధీటుగా బదులిచ్చారు.
అంతకుముందు సెప్టెంబర్ 18న కూడా చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ-వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అన్ని ఆధారాలతోనే తాము అరెస్ట్ చేశామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఐటీ శాఖ చంద్రబాబుకు పీఏకు నోటీసులు ఇచ్చిందని.. ఆయన పరారీలో వున్నారని మిథున్ వ్యాఖ్యానించారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిందన్నారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు స్టేలతో తప్పించుకున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.
ALso Read: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా
మరోవైపు.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ నెల 22న ఉదయం పదిన్నర గంటలకు తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గురువారం నాడు సాయంత్రం ప్రకటించారు.