Asianet News TeluguAsianet News Telugu

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబునాయుడును కస్టడీ కోరుతూ  సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు రేపు తీర్పును వెల్లడించనుంది. ఇవాళ సాయంత్రం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఈ విషయాన్ని ప్రకటించారు.

ACB Court adjourns verdict on  Chandrababu naidu Custody petition
Author
First Published Sep 21, 2023, 5:16 PM IST

అమరావతి:   ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును కస్టడీ కోరుతూ  ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ నెల 22న ఉదయం పదిన్నర గంటలకు తీర్పును వెల్లడించనున్నట్టుగా  ఏసీబీ కోర్టు న్యాయమూర్తి  గురువారం నాడు సాయంత్రం ప్రకటించారు. 

ఈ కేసులో ఇరువర్గాల న్యాయవాదుల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది. తీర్పును గురువారంనాడు వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది.ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు  ఈ తీర్పును వెల్లడించనున్నట్టుగా  భావించారు. అయితే ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సీఐడీ కస్టడీ పిటిషన్ పై  తీర్పును వెల్లడించే అవకాశం ఉందని సమాచారం వచ్చింది.దీంతో  ఇవాళ  సాయంత్రం నాలుగు గంటలకు  ఏసీబీ కోర్టుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదులు వచ్చారు.

also read:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 26కు వాయిదా

ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో బెంచ్ పైకి వచ్చిన న్యాయమూర్తి  ఏపీ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్  తీర్పు గురించి  ఆరా తీశారు. ఈ విషయమై ఇరువర్గాల న్యాయవాదులు  చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్ పై వివరాలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వివరించారు.  ఈ తరుణంలో ఈ కేసుతో సంబంధం లేని వారంతా కోర్టు హాల్ నుండి బయటకు వెళ్లాలని జడ్జి సూచించారు. ఈ నెల 22న చంద్రబాబు కస్టడీపై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై  తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది. రేపు ఉదయం పదిన్నర గంటల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉందని న్యాయవాదులు భావిస్తున్నారు.

 ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 9వ తేదీన  టీడీపీ చీఫ్ చంద్రబాబును  సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు.  అయితే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన  చంద్రబాబును   ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ  సీఐడీ ఏసీబీ కోర్టును   కోరింది. ఈ విషయమై  సీఐడీ దాఖలు చేసిన  పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను  ఏసీబీ కోర్టు విన్నది. ఇవాళ తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబునాయుడిని  కస్టడీ కోరుతూ ఈ నెల 11న సీఐడీ మెమో దాఖలు చేసింది సీఐడీ.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ లో తనపై నమోదైన  ఎఫ్ఐఆర్ తో పాటు రిమాండ్ ను కూడ రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  ఏపీ హైకోర్టు ఈ నెల 18వ తేదీ వరకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

  దీంతో ఈ నెల  19వ తేదీన  చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విచారణ నిర్వహించింది ఏసీబీ కోర్టు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును నిబంధనలకు విరుద్దంగా అరెస్ట్ చేశారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసు వివరాలను మీడియాకు వివరించడంపై  కూడ చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.చంద్రబాబును కస్టడీ తీసుకోవడం కూడ అవసరం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు.నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని  చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే  చంద్రబాబును విచారించి మరిన్ని విషయాలు రాబట్టవచ్చని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  అక్రమాలకు పాల్పడినట్టుగా  సీఐడీ ఆధారాలు సేకరించిందని న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే  ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు గాను  చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఐడీ తరపు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. స్కిల్ స్కాంలో  ఇద్దరు సాక్షులను విచారిస్తే  చంద్రబాబు పాత్ర బయటపడిందని  సీఐడీ తరపు న్యాయవాదులు  కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు నిన్న ముగిశాయి. ఇవాళ తీర్పును ఏసీబీ కోర్టు వెల్లడిస్తానని ప్రకటించింది. కానీ , తీర్పును రేపు వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు ఇవాళ సాయంత్రం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios