ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసారు. ఆగస్ట్ 15 నుండి మరో పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆ పథకం ఏదో తెలుసా? 

Kadapa Mahanadu : తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడు వేదికన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసారు. ఆగస్ట్ 15 అంటే స్వాతంత్య్ర దినోత్సవం నుండి మరో ఎన్నికల హామీని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఈరోజు నుండే ప్రారంభించనున్నట్లు టిడిపి అధినేత ప్రకటించారు.

ఇక తల్లికి వందనం పథకంపై కూడా క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు అందిస్తామన్నారు... స్కూళ్లు ప్రారంభించే ముందే ఇవి తల్లుల అకౌంట్లో పడతాయన్నారు. ఇలా తల్లికి వందనం పథకంపై వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణలపై మహానాడు వేదికనుండే స్పందించారు చంద్రబాబు.

రైతులకు న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇప్పటికే రాయలసీమను హార్టికల్చర్, ఆంధ్రాలో ఆక్వా కల్చర్ అభివృద్ధి చేసామన్నారు. మిరప రైతుల కోసం కేంద్రంతో మాట్లాడి మద్దతుధర అందేలా చూసామన్నారు. అలాగే కోకో, మామిడి, పొగాకు రైతులను కూడా ఆదుకున్నామన్నారు.

అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏటా 20 వేల రూపాయలు పెట్టుబడిసాయం కింద రైతులకు అందిస్తామన్నారు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6 వేలకు తమ డబ్బులు కూడా జోడించి రూ.20 వేలను మూడు విడతల్లో అందిస్తామన్నారు. కేంద్రం పీఎం కిసాన్ ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడే తాముకూడా మొదటవిడత డబ్బులు అందిస్తామన్నారు. అంటే ఈ ఏడాదే అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం రూ.55 లక్షలు పెంచే బాధ్యత తమదని చంద్రబాబు అన్నారు. సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సొసైటీని తీర్చిదిద్దుతామని... 20247 నాటికిజీరో పావర్టి సాధిస్తామన్నారు. దేశానికే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా చూస్తామన్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చి ఆటో పైలట్ లో పెడతామన్నారు. కడప నుండి చెబుతున్నా.. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా నిలబెట్టే బాధ్యత తనదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.