టిడిపి నేతకు కత్తిపోట్లు
- భారతీయ జనతా పార్టీ నేత టిడిపి నేతపై కత్తితో గాయపరిచారు
భారతీయ జనతా పార్టీ నేత టిడిపి నేతపై కత్తితో గాయపరిచారు. కర్నూలులో మిత్రపక్ష నేతల మధ్య మొదలైన తగాదా చివరకు శుక్రవారం ఉదయం కత్తులతో దాడులు చేసుకునే స్ధాయికి చేరుకోవటం సంచలనంగా మారింది. ఇంతకీ జరిగిందేమిటంటే, జిల్లాలోని పాణ్యంలో భాజపా నేత సుబ్బారాయుడుకు, టిడిపి నేత పుల్లారెడ్డికి మధ్య నిధుల విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఐటిడిఏ పనుల విషయంలో నేతల మధ్య మొదలైన వివాదమే చివరకు కత్తిపోట్ల దారితీసింది. సుబ్బారాయుడు చేసిన ఓ రోడ్డు పనిలో పుల్లారెడ్డి కమీషన్ అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కమీషన్ ఇవ్వటానికి భాజపా నేత అంగీకరించ లేదు. పైగా టిడిపి నేతపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసారు. దాంతో పుల్లారెడ్డికి మండిపోయింది. అందుకనే భాజపా నేతపై దాడికి దిగారు. అయితే, ఆ గొడవలో భాజపా నేత కత్తితో టిడిపి నేతను గాయపరచినట్లు సమాచారం. గాయపడ్డ పుల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, కత్తితో పొడిచిన భాజపా నేత సుబ్బారాయుడు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.