బాబుకు టీడీపీ సీనియర్ నేత షాక్: పవన్ భేటీ, జనసేనలోకి జంప్
టీడీపీ సీనియర్ నాయకుడు యర్రా నారాయణస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చారు. యర్రా నారాయణస్వామి నివాసానికి మంగళవారం పవన్ కల్యాణ్ వెళ్ళారు.
భీమవరం: టీడీపీ సీనియర్ నాయకుడు యర్రా నారాయణస్వామి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చారు. యర్రా నారాయణస్వామి నివాసానికి మంగళవారం పవన్ కల్యాణ్ వెళ్ళారు. నారాయణ స్వామితో పాటు ఆయన కుమారుడు నవీన్ జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు.
భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్లో ఉన్న అపార్ట్మెంట్ ప్లాట్లోకి వెళ్ళి ఆయనతో, కుమారుడు నవీన్తో సమావేశమయ్యారు. మొదట యర్రా నారాయణస్వామి దంపతుల పాదాలకు నమస్కారం చేశారు. తర్వాత పార్టీ గురించి చర్చించుకోవడానికి అందరిని బయటకు పంపించారు.
దానిపై యర్రా నవీన్ మీడియాతో మాట్లాడారు. ప్రారంభం నుంచి తన తండ్రి నారాయణస్వామి తెలుగుదేశం పార్టీలో ఎన్నో సేవలు అందించారన్నారు. ఇప్పుడు తగిన గౌరవం లభించని కారణంగానే తాను, తండ్రి పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. నేటి నుంచి తాను పవన్ కల్యాణ్ వెంట పర్యటనలో పాల్గొంటానని చెప్పారు.