ఎలాంటి సమస్యలకైనా ఇప్పుడదే పరిష్కారం...మహానాడుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్వహిస్తున్న మహానాడు2020 పై సోషల్ మీడియా వేదికన టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మహానాడును భారీగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కరోనా వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూనే మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం కేవలం ఆన్లైన్ ద్వారానే ఈసారి మహానాడు నిర్వహించనున్నారు. ఈ నెల 27,28 తేదీల్లో కేవలం ఆరు గంటల్లోనే కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో నిర్వహించే ఈ మహానాడులో 14వేల మందికి అవకాశం కల్పించనున్నారు.
ఇలా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిర్వహిస్తున్న మహానాడుపై సోషల్ మీడియా వేదికన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎలాంటి సమస్యలకైనా ఒక పరిష్కారం చూపుతుందనే నా నమ్మకం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉంది. లాక్ డౌన్ కాలంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే డిజిటల్ సోషలైజేషన్ దిశగా మనం వెళ్ళామంటే దానికి కారణం సాంకేతికత. ఈసారి జరుగుతున్న డిజిటల్ మహానాడు 2020 కూడా అలాంటిదే'' అని అన్నారు.
read more 14వేల మందితో భారీఎత్తున... లాక్ డౌన్ సమయంలోనూ టిడిపి మహానాడు
''ప్రతి ఏడాది అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా జరుపుకునే మహానాడుకు ఈసారి లాక్ డౌన్ నిబంధనలు అడ్డొచ్చాయి. అయితేనేం జూమ్ వెబినార్ పేరిట సాంకేతికత మనకో మార్గం చూపింది. దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఒక డిజిటల్ రాజకీయ సమావేశం మన మహానాడు 2020'' అని ట్వీట్ చేశారు.
''తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా మీ మొబైల్ లేదా ట్యాబులలో జూమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మే 27, 28 తేదీలలో జరిగే ఈ డిజిటల్ మహానాడులో పాల్గొనండి. ప్రతి మహానాడు మాదిరిగానే ఈ మహానాడుని కూడా విజయవంతం చేయండి'' అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు.