రాజీనామాలు చేసిన అశోక్, సుజనా
- ఏపికి జరిగిన అన్యాయం కారణంగానే తాము రాజీనామాలు చేస్తున్నట్లు తమ లేఖల్లో మంత్రులు పేర్కొన్నారు.
చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం టిడిపికి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మంత్రిపదవులకు గురువారం సాయంత్రం రాజీనామాలు సమర్పించారు. ప్రధానమంత్రికి తమ రాజీనామా లేఖలను మంత్రులిద్దరూ అందచేశారు. ఏపికి జరిగిన అన్యాయం కారణంగానే తాము రాజీనామాలు చేస్తున్నట్లు తమ లేఖల్లో మంత్రులు పేర్కొన్నారు. అదే విధంగా తమ రాజీనామా లేఖలను, రాజీనామాకు దారితీసిన పరిస్ధితులను మంత్రులు ఇతర పార్టీల ఎంపిలకు కూడా పంపిణీ చేశారు.
ప్రత్యకహోదా, ఏపి ప్రయోజనాల విషయంలో బుధవారం కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన తర్వాత రాజకీయం వేగం పుంజుకున్నది. జైట్లీ ప్రకటనపై చంద్రబాబు ఎంపిలు, రాష్ట్రమంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. దాంతో బుధవారం రాత్రి కేంద్రమంత్రులను రాజీనామాలు చేయాలని ఆదేశించినట్లు మీడియాతో చంద్రబాబు చెప్పారు. దాంతో బిజెపి-టిడిపి రాజకీయాలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి.
చంద్రబాబు ఆదేశాల ప్రకారం కేంద్రంలో టిడిపి మంత్రులు రాజీనామాలు చేయకముందే రాష్ట్రంలో బిజెపి మంత్రులు రాజీనామాలు చేయాలంటూ బిజెపి జాతీయ నాయకత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. దాంతో గురువారం ఉదయమే బిజెపికి చెందిన పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు తమ రాజీనామాలు సమర్పించారు. చంద్రబాబును కలిసి రాజీనామా లేఖలను అందచేశారు.