నా బిడ్డకు న్యాయం చేయండి: జగన్ను కలిసిన సుగాలి ప్రీతి తల్లి
అత్యాచారం, హత్యకు గురైన సుగాలి ప్రీతి తల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మంగళవారం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కర్నూలుకు వచ్చారు.
అత్యాచారం, హత్యకు గురైన సుగాలి ప్రీతి తల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మంగళవారం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కర్నూలుకు వచ్చారు.
ఈ సందర్భంగా ప్రీతి తల్లి ముఖ్యమంత్రిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన జగన్మోహన్ రెడ్డి కేసు విచారణలో ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read:పవన్ పర్యటన.. ప్రభుత్వంలో కదలిక: సుగాలి ప్రీతి కేసు సీబీఐ చేతికి...?
మూడేళ్ల క్రితం కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో ప్రీతీ బాయి అనే విద్యార్ధిని హాస్టల్ గదిలో ఉరేసుకుంది. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు.. తమ బిడ్డపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారని తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
కేసు విచారణలో భాగంగా నిపుణులతో మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా.. దానిపై నిపుణుల కమిటీని వేశారు. ఆరు కమిటీల వరకు ప్రీతి పోస్ట్మార్టాన్ని పరిశీలిచంగా.. చివరికి పోలీసులు ఈ కేసులో ఛార్జీ షీటు దాఖలు చేశారు.
అయితే నిందితులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి పోలీసులను మేనేజ్ చేస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ హోం సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని కలిసి వినతిపత్రం సైతం సమర్పించారు.
Also Read:ప్రీతికి న్యాయం చేయనప్పుడు.. కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఎందుకు: పవన్
ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కర్నూలులో ర్యాలీ నిర్వహించి సుగాలి ప్రీతి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సుగాలి ప్రీతికి న్యాయం చేయలేనప్పుడు కర్నూలులో జ్యూడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయడం దండగని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తక్షణం ఈ విషయంలో స్పందించకుంటే నిరాహారదీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.