గ్రహణ వేళల్లో ఈ ఆలయాన్ని ఎందుకు మూసివేయరు: ఇదీ విశిష్టత
గ్రహణాలు ఏర్పడే సమయంలో ఆలయాలు మూసివేయడం పరిపాటి. అయితే గ్రహణాలు ఏర్పడే సమయంలో కూడ శ్రీకాళహస్తి ఆలయం మూసివేయరు. దేశ వ్యాప్తంగా అనేక దేవాలయాలను మూసివేసినా...ఈ ఆలయాన్ని మాత్రమే తెరిచి ఉంచుతారు.
శ్రీకాళహస్తి:గ్రహణాలు ఏర్పడే సమయంలో ఆలయాలు మూసివేయడం పరిపాటి. అయితే గ్రహణాలు ఏర్పడే సమయంలో కూడ శ్రీకాళహస్తి ఆలయం మూసివేయరు. దేశ వ్యాప్తంగా అనేక దేవాలయాలను మూసివేసినా...ఈ ఆలయాన్ని మాత్రమే తెరిచి ఉంచుతారు.
సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడే సమయంలో చిన్న చిన్న ఆలయాలతో పాటు పెద్ద ఆలయాలను కూడ మూసివేస్తారు. ఏ గ్రహణం వచ్చినా కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం యధావిధిగా తెరిచే ఉంచుతారు.
దక్షిణ కైలాసంగా ఈ ఆలయం ప్రసిద్ది చెందింది.వాయులింగేశ్వర క్షేత్రంగా కూడ ఈ ఆలయాన్ని పిలుస్తారు. అందుకే ఏ గ్రహణం సమయంలోనైనా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. గ్రహణ సమయంలో ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.ఈ మేరకు శుక్రవారం నాడు కూడ ఈ ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని గ్రహణ కాల అభిషేకాలను శివుడికి నిర్వహిస్తారు.
ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి?
శ్రీకాళహస్తీశ్వరస్వామి స్వయంభు. ధృవమూర్తిగా వెలిసిన శివలింగాకృతిపై సాలీడు, పాము, ఏనుగు, భక్త కన్నప్ప గుర్తులతో స్వయంభుగా స్వామివారి లింగం ఉద్భవించింది. ఇక్కడ వెలిసిన వాయు లింగేశ్వరుని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు. సూర్యచంద్రాదులతో పాటు అగ్నిభట్టారకునితో పాటు తొమ్మిదిగ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకొని స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నాడు.
రాహు, కేతువుల ప్రభావాలు ఈ ఆలయంలో సాగవు.అందుకే భక్తులంతా ఇక్కడి క్షేత్రంలోనే రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలను జరిపించుకొంటారు. ఈ కారణంగానే గ్రహణాల సమయాల్లో కూడ ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. గ్రహణాల సమయంలో కూడ ఇక్కడ ఆలయాన్ని తెరిచి గ్రహణకాల అభిషేకాలను నిర్వహిస్తారు.