విజయనగరం జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్‌ తగిలింది.
విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. వైఎస్ రాజశేఖరెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నశత్రుచర్ల చంద్రశేఖరరాజు పార్టీని వదిలేస్తున్నట్లు సమాచారం. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వైసీపీ ఏర్పాటైన తర్వాత విజయనగరం జిల్లాలో ఆ పార్టీకి మద్దతు తెలిపిన మొదటి వ్యక్తి ఆయనే. అయితే, కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. దానికితోడు కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగి కోటలో శుక్రవారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి చంద్రశేఖరరాజు హాజరయ్యారు. దాంతో రాజు టీడీపీలో చేరిక దాదాపు ఖాయమన్నట్లే. ఎమ్మెల్సీ విజయరామరాజు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడుని కలిసి టీడీపీ కండువా కప్పుకునేందుకు చంద్రశేఖరరాజు సిద్ధంగా ఉన్నట్లు టిడిపి వర్గాల సమాచారం.
