కృష్ణా జిల్లాలో.. వాట్సాప్ కలకలం
బెంబేలెత్తిపోయిన ప్రజలు
ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్.. కృష్ణా జిల్లాలో కలకలం సృష్టించింది. దొంగలు ఇళ్లల్లో చొరబడి సొత్తు దోచుకోవడంతో పాటు మనషులపై దాడులు చేస్తున్నారని, చిన్న పిల్లలను అపహరించి హత్యలు చేస్తున్నారన్న వదంతులు వాట్సాప్ గ్రూపుల్లో వ్యాప్తి చెందటంతో కృష్ణా జిల్లాలో కలకలం రేగింది. గన్నవరం, బాపులపాడు, ఉంగటూరు మండలాల్లో గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా కర్రల, మారణాయుధాలు చేత పట్టుకుని అర్ధరాత్రి సమయాల్లో కాపలా కాస్తున్నారు.
ముఖ్యంగా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామస్తులు ఈ వదంతులతో మరింతగా భయపడుతున్నారు. గత మూడు రోజుల నుంచి అరబయట అరుగులపైనే పిల్లా పాపలతో సహా కాపలా కాస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అందోళనకు గురవుతున్నారు. గన్నవరం మండలం బుద్ధవరం, ముస్తాబాద్ బాపులపాడు మండలం పెరికీడు వీధుల్లో అనుమానంగా సంచరిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. బంధువులు, తెలిసినవారు, గ్రామస్తులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి నిమిషానికి సమాచారం పెట్టడం, మీ పిల్లలు, మీరు జాగ్రత్తగా ఉండడని పదే పదే ఫోనులు చేస్తుండటంతో భయమేస్తోందని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వందతులపై పోలీసులు చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.