జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహిస్తున్న రోడ్ షో రూట్‌లో పవర్ కట్ చోటు చేసుకుంది. వీధి లైట్లు లేకపోవడంతో జనసైనికుల సెల్‌ఫోన్‌ల వెలుగులోనే పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. 

విశాఖపట్నం కంచరపాలెం జంక్షన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లైటింగ్ వున్న మీడియా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు పోలీసులు. పవన్ కాన్వాయ్‌కి లైటింగ్ లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కాన్వాయ్ నెమ్మదిగా కదులుతూ వుండటంతో లా అండ్ ఆర్డర్ డీసీసీ సుమిత్ రంగంలోకి దిగారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు పవన్ ర్యాలీతో నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే సాయంత్రం చీకటిపడే సమయానికి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పవన్ కల్యాణ్.. బీచ్ రోడ్డులోని నోవాటెల్‌కు ర్యాలీగా వెళ్లారు. అయితే ఆయన ర్యాలీ సాగే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా స్ట్రీట్ లైట్లు కూడా వెలగలేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా పవన్ కల్యాణ్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 

ఇకపోతే... తన పర్యటనలో భాగంగా నేడు విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్‌ కల్యాణ్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ALso REad:‘‘ రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ విశాఖ’’ .... మీరు చేసేదేంట్రా బాబు : వైసీపీకి నాగబాబు చురకలు

రేపు (అక్టోబర్ 16) ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలపై వచ్చే ఆర్జీలను పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అక్కయపాలం హైవే రోడులోని పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా జనసేన వర్గాలు తెలిపాయి. 

ఇక, రేపు సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 17వ తేదీ ఉదయం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం బీచ్ రోడ్డులోని వైఎంసీఏ హాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం కానున్నారు.